ఆపదలను గట్టెక్కించే ఆంజనేయుడు

ఆపదలను గట్టెక్కించే ఆంజనేయుడు
హనుమంతుడి నామాన్ని స్మరించడం వలన దుష్టశక్తులు దూరమవుతాయి. ఆయన రూపాన్ని దర్శించడం వలన దుఃఖాలు తొలగిపోతాయి. అంకితభావంతో ఆయనని ఆరాధించడం వలన ఆపదలు గట్టెక్కుతాయి. అందుకే హనుమంతుడు ఎక్కడ వుంటే అక్కడికి ఆయన భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు, ముడుపులు కడుతూ తమ బాధలను ... భయాలను మనవిచేసుకుంటూ ఉంటారు.

అలా భక్తుల ముడుపులను స్వీకరిస్తూ వారిని అనుగ్రహించే హనుమంతుడి క్షేత్రం మనకి గుంటూరు జిల్లా 'చౌడవరం' లో దర్శనమిస్తుంది. గర్భాలయంలోని స్వామి మూర్తి పరిమాణం రీత్యా చిన్నదే అయినా, జీవం ఉట్టిపడుతూ కుదురుగా కనిపిస్తూ ఉంటుంది. ఎంతో మానసిక వేదనతో ఈ ఆలయంలోకి అడుగుపెట్టిన భక్తులకు స్వామివారు అభయముద్రలో కనిపిస్తూ, అక్కడే ప్రశాంతతను ప్రసాదిస్తూ ఉంటాడు.

ఇక్కడి స్వామిపట్ల విశ్వాసాన్ని ప్రకటిస్తూ కష్టాలు చెప్పుకోవాలే గానీ, కొండలాంటి ఆ కష్టాలు కొవ్వొత్తిలా కరిగిపోతాయని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. తమ కోరికలను నెరవేర్చమంటూ భక్తులు ముడుపుగా 'పూర్ణఫలం' కట్టే ఆచారం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. భక్తులు తమ పేరుతో ఇక్కడ పూర్ణఫలం కట్టడానికి, ఆ తరువాత దానిని గుర్తించి స్వామివారికి చెల్లించడానికి వీలుగా ఏర్పాట్లు చేయబడ్డాయి. ఇక ఇదే ప్రాంగణంలో అనఘాదేవి సమేత దత్తాత్రేయస్వామి ఆలయం కనిపిస్తుంది.

సాధారణంగా దత్తాత్రేయస్వామి ... అనఘాదేవి మూర్తులు పాలరాయితో మలచబడి కనిపిస్తూ ఉంటాయి. అందుకు భిన్నంగా ఇక్కడ నల్లరాయి మూర్తులు దర్శనమిస్తుంటాయి. తమ భక్తులను అనుగ్రహించడంలో అనఘాదేవి - దత్తాత్రేయస్వామి కూడా అందరికంటే ముందు ఉంటారనే విషయం తెలిసిందే. ఇంతటి విశిష్టమైన ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన ఆపదలు ... ఆవేదనలు తొలగిపోయి, ఆశించిన ఆనందాలు లభిస్తాయనడంలో ఎలాంటి సందేహంలేదని చెప్పొచ్చు.

More Bhakti Articles