సుఖసంతోషాలనిచ్చే ఎల్లమ్మతల్లి క్షేత్రం

సుఖసంతోషాలనిచ్చే ఎల్లమ్మతల్లి క్షేత్రం
ప్రతి గ్రామంలోను రామాలయమో ... శివాలయమో కనిపిస్తూ ఉంటుంది. అక్కడి గ్రామస్తులు ఆ దైవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉన్నప్పటికీ, తమ గ్రామ రక్షణ బాధ్యతను నిర్వహించేది మాత్రం శక్తి స్వరూపమైన గ్రామదేవతేనని విశ్వసిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో గ్రామదేవతలుగా ముత్యాలమ్మ ... పోలేరమ్మ ... ఎల్లమ్మ పేర్లు వినిపిస్తూ ఉంటాయి. జమదగ్ని మహర్షి భార్య అయిన రేణుకాదేవి ఆయా పేర్లతో ... రూపాలతో పూజలు అందుకుంటోందని చెప్పబడుతోంది.

ఇక మహాపతివ్రత అయిన రేణుకాదేవి, గ్రామదేవతగా మారడానికి వెనుక పురాణపరమైన ఒక కథ ఆసక్తికరంగా వినిపిస్తూ ఉంటుంది. జమదగ్ని మహర్షి పూజా విధులకు అవసరమైన నీటిని, తన పాతివ్రత్య మహిమతో తయారు చేసిన ఇసుక కుండలో రేణుకాదేవి నది నుంచి ఆశ్రమానికి తీసుకుని వచ్చేది. ఒకసారి గంధర్వ దంపతులను చూసిన ఆమె వారి జీవనవిధానం పట్ల క్షణకాలంపాటు ఆకర్షితురాలు అవుతుంది. దాంతో పాతివ్రత్య మహిమ కోల్పోయి ఇసుకతో కుండ చేయలేకపోతుంది.

విషయం తెలుసుకున్న జమదగ్ని మహర్షి ఆగ్రహావేశాలకు లోనవుతాడు. ఆశ్రమ జీవితానికి మచ్చ తీసుకు వచ్చిన కారణంగా రేణుకాదేవి శిరస్సును ఖండించమని పరశురాముడిని ఆదేశిస్తాడు. తండ్రి మాటను జవదాటని పరశురాముడు ఆయన ఆజ్ఞను శిరసా వహిస్తాడు. ఫలితంగా దేహం నుంచి వేరైనా రేణుకాదేవి తల అక్కడికి దూరంగా గల ఒక గూడెంలో పడుతుంది. రేణుకాదేవి పరమ సాధ్వీమణి అని తెలిసున్న గూడెం ప్రజలు ఆమె శిరస్సును అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడం ప్రారంభిస్తారు. ఈ కారణంగా రేణుకాదేవి శిరస్సు భాగం మాత్రమే మనకి మందిరాల్లో కనిపిస్తూ ఉంటుంది.

అలా అమ్మవారి తల వచ్చి పడిన ప్రదేశం ఇదేనని కర్ణాటక ప్రాంతానికి చెందిన 'నౌదత్తి' గ్రామవాసులు భావిస్తూ ఉంటారు. పూర్వం ఇక్కడికి సమీపంలోనే జమదగ్ని మహర్షి ఆశ్రమం ఉండేదని ఆనవాళ్లు చూపుతుంటారు. ఇంతటి పురాణపరమైన చరిత్రను కలిగి ఉన్న ఈ ప్రదేశంలో అమ్మవారి ఆలయం పవిత్రతకు ప్రతీకగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడి అమ్మవారిని అంకిత భావంతో సేవిస్తే సంతాన సౌభాగ్యాలు ... సిరిసంపదలు లభిస్తాయని అనుభవ పూర్వకంగా చెబుతుంటారు.

More Bhakti Articles