జరగబోయేదేమిటో బాబాకి ముందే తెలుసా ?

జరగబోయేదేమిటో బాబాకి ముందే తెలుసా ?
మశీదులో కూర్చుని బాబా ఎప్పుడూ తన సహచరులతో ఏవో కబుర్లు చెబుతూ ఉండేవాడు. తన దర్శనం కోసం వచ్చే వారిలో కొంతమంది దగ్గర మాత్రమే రెండు రూపాయలు దక్షిణగా తీసుకుంటూ ఉండేవాడు. కొంతమంది మాత్రం ఆయన ఎదురుగా రావడానికి జంకేవారు. ఎందుకంటే వాళ్ల మనసులో ఏవుందనేది అందరికీ వినిపించేలా బాబా చెప్పేవాడు.

అంతే కాకుండా మరి కాసేపట్లో అక్కడికి ఎవరు వస్తారో ... ఎక్కడ ఏం జరగబోతుందో కూడా బాబా చెప్పేసేవాడు. ఆయన చెప్పినది తూ.చ. తప్పకుండా జరగడం అక్కడి వాళ్లకి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉండేది. ఇలాంటి సంఘటనలే బాబా దైవ స్వరూపడని వాళ్లు విశ్వసించేలా చేశాయి. అయితే ఆ విధంగా వాళ్లు తనని ప్రత్యేకంగా చూడకుండా బాబా జాగ్రత్త పడేవాడు.

తనని ఎంతగానో అభిమానించేవారికి ఏదైనా కీడు జరగబోతుంటే, ముందుగానే బాబా హెచ్చరించేవాడు. అలా ఒకసారి తాత్యాకోతే పాటిల్ ఓ ముఖ్యమైన పనిమీద 'కోపర్ గావ్' బయలుదేరతాడు. గుర్రపు బండిని మశీదు ముంగిట నిలిపి హడావిడిగా బాబా దగ్గరికి వస్తాడు. అత్యవసరమైన ఓ పనిమీద తాను కోపర్ గావ్ వెళుతున్నాననీ, పనికాగానే తిరిగి వస్తానని బాబాతో చెబుతూ ఆయనకి నమస్కరిస్తాడు.

ఆ గుర్రపు బండిలో వెళ్లడం అంత మంచికాదనీ , ప్రయాణాన్ని వాయిదా వేసుకోమని చెబుతాడు బాబా. ఆయనతో ఉన్న చనువు కారణంగా ఆ మాటలను పట్టించుకోకుండా పాటిల్ అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఊరు దాటగానే ఊహించని విధంగా ఆ గుర్రపు బండి పల్టీ కొట్టి పడిపోవడంతో అక్కడక్కడా పాటిల్ కి దెబ్బలు తగులుతాయి. బాబా ఎందుకు అలా చెప్పాడో అప్పుడు ఆయనకి అర్థమవుతుంది. స్వల్పమైన గాయాలతో తనని బయటపడేసింది కూడా బాబానేనని భావించిన ఆయన, మనసులోనే బాబాకి కృతజ్ఞతలు చెప్పుకుని అక్కడి నుంచి వెనుదిరుగుతాడు.

More Bhakti Articles