సకల విద్యలను ప్రసాదించే సరస్వతీ క్షేత్రం

సకల విద్యలను ప్రసాదించే సరస్వతీ క్షేత్రం
త్రిశక్తి మాతలలో సరస్వతీదేవికి ఎంతో ప్రత్యేకత ఉంది ... మరెంతో ప్రాధాన్యత ఉంది. ఆ తల్లి అనుగ్రహమే లేకపోతే ఎవరూ దేనిని పలకలేరు ... పండితులు కాలేరు. విశ్వాన్ని చైతన్యం దిశగా నడిపిస్తోన్న సంగీత సాహిత్యాలు ఆ తల్లి కరకమలాల నుంచి జాలువారినవే. ఎవరు ఏ కళలో రాణించాలన్నా ... చరిత్రలో నిలిచిపోయే కీర్తి ప్రతిష్ఠలు సొంతం కావాలన్నా ఆమె తన చల్లని చూపులు ప్రసరింపజేయవలసిందే.

అలాంటి సరస్వతీదేవికి ఆశించిన స్థాయిలో ఆలయాలు కనిపించవు. అయితే సంఖ్యా పరంగా తక్కువగానే ఉన్నప్పటికీ, ప్రతి ఆలయం ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంటాయి. అలాంటి ప్రత్యేకతను కలిగిన అమ్మవారి క్షేత్రం మనకి గుంటూరులో కనిపిస్తుంది. శృంగేరి శారదా పీఠం వారి ఈ ఆలయం కుదురుగా తీర్చిదిద్దినట్టుగా ఉంటుంది. గర్భాలయంలో అమ్మవారి పాలరాతి మూర్తి జ్ఞాన సంబంధమైన తేజస్సుతో వెలిగిపోతూ ఉంటుంది.

ఆ తల్లి అనుగ్రహాన్ని కోరుతూ ఇక్కడ తమ పిల్లలకి అక్షరాభ్యాసం జరిపించుకునే వారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ప్రతి శుక్రవారం స్త్రీలు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని కుంకుమ పూజలు చేయిస్తుంటారు. పరీక్షల సమయంలో విద్యార్థినీ విద్యార్థులు కూడా ఈ అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇక ఇదే ప్రాంగణంలో శివుడు .. పార్వతీదేవి ... వినాయకుడు .. సీతారాములు ... హనుమంతుడు ప్రత్యేక మందిరాల్లో కొలువై భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు.

More Bhakti Articles