భగవంతుడిని రప్పించుకున్న భక్తురాలు

భగవంతుడిని రప్పించుకున్న భక్తురాలు
తిరుమలలో శ్రీనివాసుడి అనుగ్రహంతో ఆవాసాన్ని ఏర్పాటుచేసుకున్న తరిగొండ వెంగమాంబ, అనునిత్యం ... అనుక్షణం ఆ స్వామిని కీర్తిస్తూ ... సేవిస్తూ అనిర్వచనీయమైన అనుభూతిని పొందసాగింది. ఉదయం ... మధ్యాహ్నం ... సాయంత్రం వేళల్లో శ్రీవారి సేవకు అవసరమైన తులసిమాలలు అందిస్తూనే, ఆ మధ్యలో గల సమయంలో స్వామివారిపై అనేక రచనలు చేయసాగింది.

తాను రాసిన పాటలను ఆమె రాత్రి సమయాలందు ఆలపిస్తూ ఉంటే, ఆ పాటలోని మాధుర్యానికి ... ఆమె భక్తి పారవశ్యానికి మెచ్చి శ్రీ వేంకటేశ్వరుడే నేరుగా ఆమె ఇంటికి వచ్చేవాడట. ఆమె రాసిన వాటిలో తనకి నచ్చినవి మళ్లీ పాడించుకుని సంతోషంతో పొంగిపోయేవాడట. ఇలాంటి పరిస్థితుల్లోనే ఒకసారి స్వామివారు బాలకృష్ణుడు రూపంలో వెంగమాంబ దగ్గరికి వచ్చి, తనకి భాగవతాన్ని ద్విపదలో రాసి వినిపించమని కోరాడట.

ద్వాపరయుగాన్ని కృష్ణుడిగా ప్రభావితం చేసిన పరమాత్ముడే కలియుగంలో శ్రీనివాసుడుగా ఆవిర్భవించాడనే విషయం ఆ భక్తురాలికి తెలుసు. అనేక మార్లు ఆయన లీలావిశేషాలను వింటూ ఆమె మురిసిపోయినదే. అందుకే స్వామివారి ఆదేశాన్ని అదృష్టంగా భావించి, ఆయన ముచ్చట తీర్చడం కోసం ఆమె అహర్నిశలు అలుపనేది తెలియకుండా ద్విపదలో భాగవత రచన పూర్తి చేసింది.

అయితే చాలా సందర్భాల్లో ఆమె ఆ గ్రంధాన్ని రచిస్తూ ఉండగా స్వామివారు అక్కడే కూర్చుని ఉండేవాడట. ఆమె పైకి చదువుతూ రచన సాగిస్తుంటే, ఆ స్వామి ఆనందానుభూతులకు లోనయ్యేవాడు. ఆయన కన్నులలోని ఆనందాన్ని చూస్తూ, తన జీవితం సార్ధకమైనదన్నట్టుగా ఆమె ఆనంద బాష్పాలను వర్షించేది. అలా భగవంతుడినే ఇంటికి రప్పించుకున్న మహా భక్తురాలిగా తరిగొండ వెంగమాంబ చరిత్రలో నిలిచిపోయింది.

More Bhakti Articles