తన విగ్రహాన్ని తానే మలచిన శ్రీరాముడి క్షేత్రం

తన విగ్రహాన్ని తానే మలచిన శ్రీరాముడి క్షేత్రం

తన విగ్రహాన్ని తానే మలచిన శ్రీరాముడి క్షేత్రం
శ్రీరాముడు వనవాస కాలంలో అనేక ప్రాంతాలలో శివలింగాలను ప్రతిష్ఠిస్తూ వెళ్లాడు. ఆయన అడుగుపెట్టిన చాలా ప్రదేశాల్లో రామాలయాలు నిర్మించబడ్డాయి. ఈ నేపథ్యంలో అనేక శైవ క్షేత్రాలు ... వైష్ణవ క్షేత్రాలు ఆవిర్భావిస్తూ వచ్చాయి. కరీంనగర్ జిల్లా 'ఇల్లందకుంట' గ్రామలో గల రామాలయం ఈ నేపథ్యంలో ఆవిర్భవించినదే. సీతారామలక్ష్మణులు వనవాసానికి బయలుదేరి ఈ ప్రదేశంలో సేదదీరుతున్నప్పుడే, దశరథ మహారాజు మరణవార్త తెలిసిందట.

అప్పుడు శ్రీరాముడు ఇక్కడ లభించిన ఇల్లందచెట్టు గింజలతో శ్రార్ధ కర్మలు నిర్వహించినట్టు స్థలపురాణం చెబుతోంది. ఈ కారణంగానే ఈ ప్రదేశానికి 'ఇల్లందకుంట' అనే పేరు వచ్చిందనీ, కాలక్రమంలో అది కాస్తా ఇల్లంతకుంటగా మార్పు చెందిందని అంటారు. ఆ తరువాత ఈ ప్రాంతానికి చెందిన భక్తుడికి కలలో శ్రీరాముడు కనిపించి, ఈ ప్రదేశంలో గల ఓ బండరాయిపై తమ రూపాలను చెక్కించి, ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడట.

దాంతో ఆ భక్తుడు మంచి శిల్పి కోసం వాకబు చేస్తూ ఉండగా ఒక వ్యక్తి తారసపడి, విగ్రహాలను మలచడంలో తనకి మంచి నైపుణ్యముందని చెబుతాడు. ఆ భక్తుడు శిల్పిని ఆ బండరాయి దగ్గరికి తీసుకువెళ్లి పని అప్పగిస్తాడు. విగ్రహాలను మలిచే సమయలో తాను అన్నపానియాలు స్వీకరించననీ, తాను బయటికి వచ్చేంత వరకూ ఎవరూ లోపలికి రాకూడదని ఆ శిల్పి చెబుతాడు. అప్పటి వరకూ తాను బయటనే వేచి ఉంటానని భక్తుడు అంటాడు.

ఆ రాయి చుట్టూ పరదాలు కట్టుకుని ఆ శిల్పి పని ప్రారంభిస్తాడు. వారం రోజులపాటు ఆ భక్తుడికి ఆగకుండా ఉలిదెబ్బలు వినిపిస్తూనే ఉంటాయి. ఏడో రోజు సాయంత్రం హఠాత్తుగా ఆ ధ్వని ఆగిపోవడంతో, శిల్పి బయటికి వస్తాడేమోనని ఆ భక్తుడు ఎదురు చూస్తాడు. ఎంతసేపటికీ అతను బయటికి రాకపోవడంతో, పరదాలు తొలగించి చూస్తాడు. అక్కడ సీతారామలక్ష్మణుల రూపాలు నయన మనోహరంగా చెక్కబడి ఉంటాయి. అయితే అక్కడ శిల్పి మాత్రం కనిపించలేదు. దాంతో సాక్షాత్తు శ్రీరాముడే ఆ శిల్పి రూపంలో వచ్చాడనే విషయాన్ని ఆ భక్తుడు గ్రహిస్తాడు. గ్రామస్తుల సహాయ సహకారాలతో ఆలయాన్ని నిర్మిస్తాడు.

ఆనాటి నుంచి నిత్యోత్సవాల నుంచి వార్షికోత్సవాల వరకూ అన్ని రకాల సేవలను ఘనంగా నిర్వహిస్తుంటారు. ప్రశాంతమైన వాతావరణంలో ... సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయం పవిత్రతకు ప్రతీకగా అలరారుతోంది. ఇక్కడి రాముల వారిని పూజించడం వలన కష్టాలు కనుమరుగైపోతాయని భక్తులు చెప్పుకుంటూ ఉంటారు. ప్రతి ఏడాది ఇక్కడ జరిగే సీతారాముల కల్యాణోత్సవం చూసి తీరవలసిందే.

More Bhakti Articles