మాఘ పౌర్ణమి విశిష్టత

పవిత్రమైనటువంటి మాసాలా జాబితాలో వైశాఖ ... కార్తీక మాసాల తరువాత స్థానంలో 'మాఘమాసం' కనిపిస్తుంది. శుభప్రదమైన వివిధ కార్యక్రమాలకు ఈ మాసం అనుకూలమైనదని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్నో పుణ్య విశేషాలను సంతరించుకున్న మాఘమాసంలో 'పౌర్ణమి' రోజుకి వున్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.
మాఘమాసంలో సాధారణ రోజుల్లోనే ఉదయం చలి వేళలో నదిలోగానీ ... చెరువులోగాని ... కోనేరులోగాని చేసే స్నానం వలన, గంగానదిలో స్నానమాచరించిన ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. అలాంటిది అత్యంత విశిష్టమైన పౌర్ణమి రోజున ఆచరించే జపతపాల వలన ఎంతటి పుణ్యఫలాలు కలుగుతాయో ఊహించవచ్చు.
మాఘపౌర్ణమి రోజున తెల్లవారు ఝామునే నదీ స్నానం చేసి, సమస్త జీవరాశికి ఆధారమైన సూర్యభగవానుడికి నమస్కరించాలి. ఇటు వైష్ణవ ఆలయానికి ... అటు శివాలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకోవాలి. అత్యంత భక్తి శ్రద్ధలతో దైవాన్ని పూజించడమే కాకుండా శక్తిమేరకు దానధర్మాలు చేయాలి. ఈ విధంగా చేయడం వలన జన్మజన్మలుగా వెంటాడుతోన్న పాపాలు ... దోషాలు నశించి, అశ్వమేథ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని సాక్షాత్తు శ్రీ కృష్ణుడే ధర్మరాజుతో చెప్పినట్టుగా తెలుస్తోంది.
మాఘపౌర్ణమి రోజున చేసే స్నానాల వలన ... పూజల వలన ... దానాల వలన వ్యాధుల నుంచి బాధల నుంచి విముక్తి కలుగుతుంది. ఆ పుణ్య ఫలాల విశేషం కారణంగా ఉన్నతమైన జీవితం లభిస్తుంది. మరణం అనంతరం కోరుకునే శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది.