AAP: కేజ్రీవాల్ చెప్పేవన్నీ అబద్ధాలే..! ఆప్ చీఫ్ ఆరోపణలను కొట్టిపారేసిన బీజేపీ

  • గుజరాత్ ఎన్నికలకు దూరంగా ఉంటే .. ఆప్ మంత్రులపై కేసులు మాఫీ 
  • బీజేపీ నుంచి ఆఫర్ వచ్చిందన్న ఢిల్లీ ముఖ్యమంత్రి
  • ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కేజ్రీవాల్ పై మండిపడ్డ బీజేపీ
BJP Rubbishes Arvind Kejriwal Big Claim Of Gujarat Deal

ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పేవన్నీ అబద్ధాలేనని బీజేపీ కొట్టిపారేసింది. గుజరాత్ ఎన్నికలకు సంబంధించి కేజ్రీవాల్ తో డీల్ మాట్లాడాల్సిన అవసరం తమ పార్టీకి లేదని బీజేపీ గుజరాత్ అధికార ప్రతినిధి సయ్యద్ జఫర్ ఇస్లాం తేల్చిచెప్పారు. ఢిల్లీ ప్రజలతో పాటు, దేశ ప్రజలను కేజ్రీవాల్ తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి రావడానికి అన్నా హజారేను ఉపయోగించుకున్నారని, కుర్చీలో కూర్చున్నాక హజారేను దూరం పెట్టారని ఆరోపించారు. అధికారంకోసం ఎవరినైనా తప్పుదోవ పట్టించేందుకు కేజ్రీవాల్ ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాడని సయ్యద్ విమర్శించారు.

గుజరాత్ ఎన్నికలలో ఆప్ పోటీ చేయకుండా ఉంటే సత్యేందర్ జైన్, సిసోడియాలను కేసుల నుంచి తప్పిస్తామని బీజేపీ నుంచి ఆఫర్ వచ్చిందని కేజ్రీవాల్ శనివారం పేర్కొన్నారు. అయితే, ఈ ఆఫర్ ఎవరు ఇచ్చారనే ప్రశ్నకు కేజ్రీవాల్ సూటిగా జవాబివ్వలేదు. తన పార్టీలో ఓ నేత ద్వారా బీజేపీ ఈ ఆఫర్ ఇచ్చిందని చెప్పారు. బీజేపీ ఎప్పుడూ నేరుగా ఆఫర్ ఇవ్వదని, నలుగురు ఐదుగురి మధ్య తిరిగి చివరికి అందుతుందని ఆయన తెలిపారు.

More Telugu News