Corona Virus: దేశంలోకి అత్యంత ప్రమాదకర కరోనా కొత్త వేరియంట్.. మహారాష్ట్రలో గుర్తింపు

  • వేగంగా వ్యాప్తి చెందే ఎక్స్ ఎక్స్ బీని గుర్తించిన నిపుణులు
  • మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా కేసులు
  • అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన వైద్యులు
COVID19 XXB variant spreading fast likely to be most contagious in Maharashtra

దేశంలో మొన్నటిదాకా పూర్తిగా కంట్రోల్ లోకి వచ్చిన కరోనా మళ్లీ విజృంభిస్తోంది. కరోనా పాజిటివ్ ల సంఖ్య పెరుగుతోంది. పండుగ సీజన్ లో రోజువారీ కేసుల సంఖ్య పెరగడంతో పాటు మహారాష్ట్రలో కొత్త, అత్యంత వేగంగా వ్యాప్తి చెందే వేరియంట్లు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. 

ఇప్పటిదాకా వెలుగు చూసిన కరోనా వేరియంట్లలో ప్రమాదకర, వేగంగా వ్యాప్తి చెందేది ఎక్స్ఎక్స్ బీ (XXB) రకమని నిపుణులు భావిస్తున్నారు. గత వారంలో ముంబై, థానే, పూణే, రాయ్‌గడ్‌లోని ఎక్కువ జన సాంద్రత కలిగిన ప్రాంతాల్లో ఈ వేరియంట్ వెలుగు చూటడం ఆందోళన రేకెత్తించింది. ఈ నెల 10–16 తేదీల మధ్య  కేసుల సంఖ్య 17.7 శాతానికి పైగా పెరిగినట్లు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

ఎక్స్ ఎక్స్ బీ వేరియంట్ ఇప్పటిదాకా 17 దేశాలకు వ్యాపించింది. బీఏ 2.75, బీజే.1 సబ్-వేరియంట్‌ల కంటే దీని వృద్ధి ఎక్కువగా ఉందని నిపుణులు భావిస్తున్నారు. గత ఆరు నెలల్లో భారత దేశంలో దాదాపు 90 శాతం కొత్త ఇన్‌ఫెక్షన్‌లు బీఏ .2.75 వల్ల సంభవించాయని, ఎక్స్ ఎక్స్ బీ 7 శాతంగా ఉందని తేలింది.

 ఈ సంవత్సరం ఆగస్టులో సింగపూర్ లో వెలుగు చూసిన ఎక్స్ ఎక్స్ బీ  వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఎక్స్ ఎక్స్ బీ స్పైక్ ప్రోటీన్ పై ఏడు ఉత్పరివర్తనాలను కలిగి ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను కూడా తప్పించుకుంటుంది కాబట్టి వ్యాప్తి రేటు భారీగా ఉందని నిపుణులు చెబుతున్నారు. వృద్ధులు, దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్లు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. మాస్కులు ధరించాలని సూచించారు.

More Telugu News