Chandrababu: చంద్ర‌బాబుపై మంత్రులు బొత్స‌, కారుమూరి ఘాటు వ్యాఖ్య‌లు

  • క‌ర్నూలు జిల్లా చేరుకున్న వైసీపీ బ‌స్సు యాత్ర‌
  • చంద్ర‌బాబుపై విరుచుకుప‌డ్డ మంత్రులు
  • టీడీపీ అధినేత‌కు పాడు చేయ‌డ‌మే తెలుస‌న్న కారుమూరి
  • చంద్ర‌బాబుది దుర్మార్గ‌పు ఆలోచ‌న అన్న బొత్స‌
ap ministers fires on tdp chief chandrababu

వైసీపీకి చెందిన మంత్రులు టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడుపై వ‌రుస‌గా విరుచుకుప‌డుతున్నారు. శ‌నివారం న‌ర‌స‌రావుపేట‌లో జ‌రిగిన సామాజిక చైత‌న్య యాత్ర‌లో భాగంగా చంద్ర‌బాబుపై ఘాటు వ్యాఖ్య‌లు చేసిన మంత్రులు.. తాజాగా యాత్ర క‌ర్నూలు జిల్లాకు చేరుకున్న సంద‌ర్భంగానూ చంద్ర‌బాబుపై దాడిని కొన‌సాగించారు. ఈ సంద‌ర్భంగా మంత్రులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, కారుమూరి నాగేశ్వ‌ర‌రావులు చంద్ర‌బాబుపై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

చంద్ర‌బాబుకు మంచి చేయ‌డం చేత‌గాదు కానీ ఆయ‌న‌కు ఏదైనా పాడు చేయ‌డ‌మే తెలుసున‌ని మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర‌రావు మండిప‌డ్డారు. చంద్ర‌బాబు ఏనాడైనా పేద‌ల‌కు సెంటు భూమి ఇచ్చారా? అని ప్ర‌శ్నించారు. చంద్ర‌బాబుకు మెద‌డు చితికిపోయింద‌ని మ‌రింత ఘాటు వ్యాఖ్య చేసిన కారుమూరి... ఆ కార‌ణంగానే తానేం మాట్లాడుతున్నాన‌న్న విష‌యం ఆయ‌న‌కే తెలియడం లేద‌న్నారు.

ఆ వెంట‌నే అందుకున్న మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఏపీకి ప్ర‌త్యేక హోదాకు తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని తెలిపారు. ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన చంద్ర‌బాబు ఏం గాడిన పెట్టార‌ని ప్ర‌శ్నించారు. చంద్ర‌బాబు కాంట్రాక్ట‌ర్ల‌కు ఏకంగా రూ.2 ల‌క్ష‌ల కోట్ల‌ను దోచిపెట్టార‌ని ఆరోపించారు. కాంట్రాక్ట‌ర్ల కోస‌మే చంద్ర‌బాబు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టార‌ని కూడా బొత్స ధ్వ‌జ‌మెత్తారు. చంద్ర‌బాబుది దుర్మార్గ‌పు ఆలోచ‌న అంటూ బొత్స విమ‌ర్శించారు.

More Telugu News