BOLLYWOOD: కశ్మీర్ ఫైల్స్ బాలీవుడ్ పాపాలను కడిగేసే చిత్రం: కంగనా రనౌత్

  • సినిమా పరిశ్రమ చేసిన పాపాలనూ కడిగేసింది
  • ప్రతి ఒక్కరూ దీన్ని ప్రోత్సహించాలి
  • మంచి సినిమాను తీసిన బృందానికి అభినందనలన్న కంగన 
They have also washed away the sins committed by Bollywood

ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కశ్మీర్ ఫైల్స్ సినిమాను వీక్షించారు. బాలీవుడ్ చేసిన పాపాలను కడిగేసే చిత్రంగా వ్యాఖ్యానించారు. చక్కని సినిమాను తీసిన బృందానికి అభినందనలు తెలిపారు.

వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కశ్మీరీ పండిట్లపై జరిగిన దారుణాలను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అనుపమ్ ఖేర్, మిధున్ చక్రవర్తి, నటి, నిర్మాత పల్లవి జోషి ఇందులో నటించారు. ఈ సినిమాను వీక్షించిన అనంతరం కంగనా రనౌత్ తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. 

‘‘వారికి చాలా అభినందనలు. సినిమా పరిశ్రమ పాపాలను వారు కడిగేశారు. బాలీవుడ్ చేసిన పాపాలను కూడా ప్రక్షాళించారు. ఎంతో గొప్ప సినిమాను తీశారు. పరిశ్రమలో ఎలుకల్లా దాగిన వారు బయటకు వచ్చి ఈ సినిమాను ప్రోత్సహించాలి. పనికిరాని సినిమాలను ప్రోత్సహించే వారందరూ ఈ మంచి సినిమాకు మద్దతుగా నిలవాలి’’ అని కంగన పిలుపునిచ్చారు. 

గతవారం కూడా కంగన ఈ సినిమాకు మద్దతుగా మాట్లాడారు. ఈ ఏడాది వచ్చిన వాటిల్లో ఎంతో విజయవంతమైన, లాభదాయకమైన చిత్రంగా ఆమె దీన్ని పేర్కొంటూ, కేస్ స్టడీగా తీసుకోవాలన్నారు. 

మరోవైపు కశ్మీర్ ఫైల్స్ పెద్ద ఎత్తున ఆదరణ చూరగొంటోంది. బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది. సోమవారం వరకు మొదటి నాలుగు రోజుల్లో రూ.42.20 కోట్లు వసూలు చేసింది. మొదటి రోజు గత శుక్రవారం 3.55 కోట్లు (దేశీయంగా), శనివారం రూ.8.50 కోట్లు, ఆదివారం రూ.15.10 కోట్లు, సోమవారం రూ.15.05 కోట్ల చొప్పున ఆదాయం వచ్చిందంటూ ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.

More Telugu News