: నాకు ఎమ్మెల్యేల మద్దతు ఉంది..ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించరే?: శశికళ

ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తనను ఆహ్వానించకుండా గవర్నర్ విద్యాసాగర్ రావు ఎందుకు జాప్యం చేస్తున్నారు? అని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ప్రశ్నించారు. పొయెస్ గార్డెన్ లో పార్టీ నేతలు, సినీ ప్రముఖులతో ఈ రోజు ఆమె సమావేశమయ్యారు. తాజా పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై ఆమె చర్చించారు. ఈ సందర్భంగా శశికళ మాట్లాడుతూ, తనకు 133 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, తనతో ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయమై గవర్నర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని అన్నారు. గవర్నర్ కు తాను ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదని, సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం జరుగుతోందని అన్నారు. పార్టీని చీల్చేందుకు కొందరు కుట్ర పన్నారని, ఆ కుట్ర పన్నింది ఎవరో అందరికీ తెలుసని అన్నారు. బెదిరింపులకు తాను భయపడనని, పార్టీ ప్రధాన కార్యదర్శిగా వాటిని ఎదుర్కొంటానని, అన్నా డీఎంకే ప్రభుత్వం పూర్తి కాలం అధికారంలో ఉంటుందని చెప్పిన ఆమె, రిసార్ట్ లో ఉన్న ఎమ్మెల్యేలను మరోమారు కలిసేందుకు బయలు దేరి వెళ్లారు.

More Telugu News