: ఉత్తర, తూర్పు భారతాన్ని వణికిస్తున్న వరదలు.. 80 మంది మృతి
తూర్పు, ఉత్తర భారతదేశాన్ని వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. అసోం, మేఘాలయ, బీహార్, పశ్చిమబెంగాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల కారణంగా మొత్తం 58 మంది ప్రాణాలు కోల్పోగా ఒడిశాలో పిడుగు పడి 27 మంది దుర్మరణం చెందారు. అసోంలో వరదలు 29 మందిని పొట్టన పెట్టుకోగా దాదాపు 37 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 3,300 గ్రామాలు దెబ్బతిన్నాయి. కేంద్ర హోంమంత్రి రాజనాథ్ సింగ్ శనివారం అసోంలోని వరద బాధిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించి పరిస్థితిని అంచనా వేశారు. మేఘాలయలో ముగ్గురు మృతి చెందగా ఇద్దరు వరదనీటిలో కొట్టుకుపోయారు. ఇక బీహార్లో పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రాష్ట్రంలో 26.19 మంది ప్రజలపై వరద ప్రభావం పడింది. ఈస్ట్ చంపారన్, ముజఫర్పూర్ జిల్లాలు కూడా వరదల బారిన పడినట్టు శనివారం ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 26 మంది మృతి చెందారు. ఇద్దరు బాలికలు వరద నీటిలో కొట్టుకుపోయారు. ఒడిశాలో పిడుగుపాటుకు 27 మంది మృతి చెందారు.