BR Naidu: తిరుమలలో ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి చెందుతున్నారు: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించారు. దర్శన క్యూలైన్లు, మహాద్వారం వద్ద భక్తులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈసారి టీటీడీ చేపట్టిన ఏర్పాట్లపై భక్తులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని, ఎలాంటి అసౌకర్యం కలగలేదని చెప్పారని బీఆర్ నాయుడు తెలిపారు.

అనంతరం చైర్మన్ బీఆర్ నాయుడు లడ్డూ కౌంటర్లను తనిఖీ చేశారు. లడ్డూల విక్రయాలు, సిబ్బంది పనితీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అవసరమైనన్ని లడ్డూలు అందుబాటులో ఉండటం, అన్ని కౌంటర్లు నిరంతరాయంగా పనిచేస్తుండటంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారని ఆయన పేర్కొన్నారు. లడ్డూల రుచి, నాణ్యత విషయంలో కూడా భక్తుల నుంచి మంచి స్పందన వచ్చిందని వివరించారు.

వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రోజుకు సుమారు 4.8 లక్షల లడ్డూలు తయారు చేస్తున్నట్లు అధికారులు తెలిపారని చైర్మన్ వెల్లడించారు. భక్తులకు ఎలాంటి జాప్యం జరగకుండా అన్ని కౌంటర్లు తెరిచి ఉంచి నిరంతర సేవలు అందించాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు. భక్తుల సౌకర్యమే ప్రథమ లక్ష్యంగా టీటీడీ పనిచేస్తుందని ఈ సందర్భంగా బీఆర్ నాయుడు స్పష్టం చేశారు.
BR Naidu
TTD
Tirumala
Vaikuntha Dwaram
Ladoo
Tirupati
Devotees
Temple
Andhra Pradesh
Pilgrimage

More Telugu News