బంగ్లాదేశ్ ఎన్నికలు... రెండు చోట్ల నుంచి తారిఖ్ రెహ్మాన్ పోటీ

  • ఢాకా-17, బోగ్రా-6 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడి
  • ఓటరు జాబితాలో చేర్చేందుకు ఎన్నికల కమిషన్ అంగీకారం
  • ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు
బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) యాక్టింగ్ ఛైర్మన్ తారిఖ్ రెహ్మాన్ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఢాకా-17, బోగ్రా-6 నియోజకవర్గాల నుంచి ఆయన బరిలో దిగుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. బోగ్రా-16 నియోజకవర్గానికి గతంలో తారిఖ్ రెహ్మాన్ తల్లి, మాజీ ప్రధాని ఖలీదా జియా ప్రాతినిధ్యం వహించారు. ఒకప్పుడు ఈ స్థానం బీఎన్‌పీకి కంచుకోటగా ఉండేది. అయితే, 2023లో జరిగిన ఉప ఎన్నికల్లో అవామీ లీగ్ నాయకుడు ఆషన్ రిపు ఇక్కడ విజయం సాధించారు.

బంగ్లాదేశ్‌లో ఫిబ్రవరి 12న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుండటంతో తారిఖ్ రెహ్మాన్ తరఫున బీఎన్‌పీ నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. సుమారు 17 ఏళ్ల తర్వాత తారిఖ్ రెహ్మాన్ బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చారు. ఎన్నికలకు కొన్ని వారాల ముందు ఓటరు జాబితాలో ఆయన పేరును చేర్చేందుకు ఎన్నికల సంఘం అంగీకరించింది.

కాగా, మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ కార్యకలాపాలపై నిషేధం కొనసాగుతున్నందున, ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం కుదరదని తాత్కాలిక ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది. షేక్ హసీనా గద్దె దిగినప్పటి నుంచి బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత నెలకొన్న విషయం తెలిసిందే.


More Telugu News