Amit Shah: బంగ్లాదేశ్ చొరబాటుదారులు దేశంలో ఎక్కడున్నా పంపించేస్తాం: అమిత్ షా

భారతదేశంలో ఎక్కడ ఉన్నా బంగ్లాదేశ్ చొరబాటుదారులను వెనక్కి పంపిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. అసోంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, సరిహద్దులు దాటి రాష్ట్రంలోకి చొరబడిన బంగ్లాదేశీయులు ఇక్కడి ప్రజల సంస్కృతి, గుర్తింపులకు ముప్పుగా పరిణమిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వారిని ఓటు బ్యాంకుగా చూస్తోందని ఆయన ఆరోపించారు.

ఆ ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు ప్రతిపక్ష కూటమి ఓటరు జాబితా ఎస్ఐఆర్‌ను వ్యతిరేకిస్తోందని విమర్శించారు. అసోంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఏళ్లు అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని దుయ్యబట్టారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజల సాంస్కృతిక గుర్తింపును కాపాడటంతో పాటు రాష్ట్ర సమగ్ర అభివృద్ధిపై దృష్టి సారించిందని తెలిపారు.

బంగ్లాదేశ్ చొరబాటుదారులు ఆక్రమించుకున్న లక్షకు పైగా బిఘాల భూమిని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం విడిపించిందని కొనియాడారు. రాష్ట్రంలో పాతుకుపోయిన చొరబాటుదారులను పూర్తిగా నిర్మూలించడానికి బీజేపీకి మరో అవకాశం ఇవ్వాలని కోరారు. గత 11 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని పలు మిలిటెంట్ సంస్థలతో శాంతి ఒప్పందం చేసుకుందని గుర్తు చేశారు.
Amit Shah
Bangladesh infiltrators
Assam
Himanta Biswa Sarma
BJP
Congress
Immigration
Voter list

More Telugu News