కల్తీ మద్యం కేసులో కీలక మలుపు.. ఐదుగురు నిందితుల విచారణకు కోర్టు గ్రీన్ సిగ్నల్

  • నకిలీ మద్యం కేసులో ఐదుగురు నిందితులకు కస్టడీ
  • మూడు రోజుల పాటు విచారించనున్న సిట్ అధికారులు
  • తంబళ్లపల్లి కోర్టు అనుమతితో పోలీసుల అదుపులోకి నిందితులు 
  • మదనపల్లె సబ్‌జైల్ నుంచి ఎక్సైజ్ స్టేషన్‌కు తరలింపు
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసు దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. ఈ కేసులోని ఐదుగురు ప్రధాన నిందితులను మూడు రోజుల కస్టడీకి ఇస్తూ తంబళ్లపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. కోర్టు ఆదేశాలతో ఎక్సైజ్ పోలీసులు ఈరోజు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. ఈ కేసులో ఏడుగురు నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఎక్సైజ్ పోలీసులు తంబళ్లపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఐదుగురు నిందితులను మూడు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం మదనపల్లె సబ్‌జైల్లో రిమాండ్‌లో ఉన్న ఏ1 అద్దేపల్లి జనార్దన్ రావు, ఏ26 జగన్మోహన్ రావు, ఏ28 తాండ్ర రమేశ్‌, ఏ27 తిరుమలశెట్టి శ్రీనివాసరావు, ఏ29 షేక్ అల్లబక్షులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

కస్టడీకి తీసుకున్న వెంటనే నిందితులకు వైద్య పరీక్షల కోసం ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. వైద్య ప‌రీక్ష‌లు పూర్త‌యిన త‌ర్వాత‌ వారిని విచారణ నిమిత్తం మదనపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు తరలించనున్నారు. ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు వీరిని ప్రశ్నించి కీలక సమాచారం రాబట్టే అవకాశం ఉంది. ఈ విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి రావచ్చని అధికారులు భావిస్తున్నారు.


More Telugu News