సిమ్లా ఆసుపత్రిలో రోగిని చితకబాదిన డాక్టర్ డిస్మిస్!

  • వైద్యుడి అమానుషంపై సర్కార్ కఠిన చర్య
  • దర్యాప్తు నివేదిక రాగానే వేటు
  • సీనియర్ రెసిడెంట్ పోస్టు నుంచి శాశ్వతంగా తొలగింపు 
కొన్ని రోజుల క్రితం సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీలో బెడ్‌పై ఉన్న రోగిని వైద్యుడు చితకబాదిన ఘటనలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాడికి పాల్పడిన డాక్టర్ రాఘవ్ నిరులాను ఉద్యోగం నుంచి తొలగిస్తూ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దర్యాప్తు అధికారుల నివేదిక ఆధారంగా ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

ఈ నెల 22న ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న అర్జున్ సింగ్‌పై డాక్టర్ రాఘవ్ విచక్షణ రహితంగా దాడి చేశారు. ఆక్సిజన్ కొరతకు సమాధానం చెప్పలేక రోగిని పిడిగుద్దులతో బాదడమే కాకుండా, అతడి ఆక్సిజన్ పైపును కూడా తెంచేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో స్పందించిన ప్రభుత్వం, సదరు వైద్యుడిని సీనియర్ రెసిడెంట్ పోస్ట్ నుంచి శాశ్వతంగా తొలగించి ఇతర వైద్యులకు గట్టి హెచ్చరిక పంపింది.

వైద్యుడిని తొలగించిన విషయం తెలుసుకున్న బాధితుడు అర్జున్ సింగ్ మాట్లాడుతూ, "నాపై జరిగిన అమానుష దాడికి న్యాయం జరిగింది. ఇలాంటి చర్యలు తీసుకున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు" అని పేర్కొన్నారు. కాగా, ఈ దాడిలో సహకరించిన మరో గుర్తుతెలియని డాక్టరుపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది.


More Telugu News