Donald Trump: ఎస్ సీవో లో మోదీ కీలక భేటీ... భారత్ పై అక్కసు వెళ్లగక్కిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత్‌తో తమ దేశ వాణిజ్య సంబంధాల నేపథ్యంలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం "ఏకపక్ష విపత్తు"గా మారిందని ఆయన సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా కంపెనీలపై భారత్ అత్యధిక సుంకాలు విధిస్తుండడం, రష్యా నుంచి చమురు, ఆయుధాలు కొనుగోలు చేయడం వంటి అంశాలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

చైనాలోని టియాంజిన్‌లో షాంఘై సహకార సంస్థ (ఎస్ సీవో) సదస్సులో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లతో భారత ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమైన అనంతరం ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్' వేదికగా ఆయన ఈ విమర్శలు చేశారు.

దశాబ్దాలుగా ఈ 'ఒక వైపు వాణిజ్యం' కొనసాగుతోందని ట్రంప్ ఆరోపించారు. "భారత్ మనకు భారీగా సరుకులు అమ్ముతుంది, కానీ మనం వారికి చాలా తక్కువగా విక్రయిస్తున్నాం. ఇది పూర్తిగా ఒకవైపు సంబంధం" అని తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలను భారత్ విధిస్తోందని, దీనివల్ల అమెరికా కంపెనీలు భారత మార్కెట్‌లో నిలదొక్కుకోలేకపోతున్నాయని ఆయన విమర్శించారు.

అమెరికా నుంచి కాకుండా రష్యా నుంచి భారత్ తన చమురు, సైనిక అవసరాలను తీర్చుకోవడంపై కూడా ట్రంప్ మండిపడ్డారు. "ఇప్పుడు వారు సుంకాలను పూర్తిగా తొలగిస్తామని ఆఫర్ ఇచ్చారు, కానీ చాలా ఆలస్యమైపోయింది. ఇది చాలా ఏళ్ల క్రితమే జరగాల్సింది" అని ఆయన అన్నారు.

ట్రంప్ చేసిన ఈ విమర్శలకు కొన్ని రోజుల ముందే, ఆయన ప్రభుత్వం భారత ఉత్పత్తులపై 50 శాతం సుంకాన్ని విధించింది. అమెరికాను వ్యతిరేకిస్తూ భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడాన్నే ఇందుకు కారణంగా చూపింది.
Donald Trump
India US trade
US India relations
Trade tariffs
Narendra Modi
Russia oil
China
SCO summit
American companies
Trade imbalance

More Telugu News