సింగయ్య మృతి కేసు.. జగన్‌కు హైకోర్టులో తాత్కాలిక ఊరట

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. పల్నాడు జిల్లాలో సింగయ్య అనే వృద్ధుడి మృతికి సంబంధించిన కేసులో ఆయనపై తదుపరి చర్యలు తీసుకోకుండా రెండు వారాల పాటు స్టే విధిస్తూ న్యాయస్థానం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ కేసుకు సంబంధించి తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం విచారణ జరిగింది. జగన్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ, ఈ కేసులో సెక్షన్‌ను బీఎన్‌ఎస్ కింద 105కు మార్చారని, అందువల్ల తదుపరి చర్యలు, అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని అభ్యర్థించారు.

మరోవైపు, ప్రభుత్వ తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆధారాలు, ఇతర సాక్ష్యాలను కోర్టు ముందు ఉంచేందుకు తమకు రెండు వారాల సమయం కావాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, రెండు వారాల పాటు ఈ కేసులో ఎలాంటి తదుపరి చర్యలు చేపట్టవద్దని పోలీసులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

అసలేం జరిగిందంటే?

ఇటీవల పల్నాడు జిల్లా, సత్తెనపల్లి మండలం, రెంటపాళ్ల గ్రామంలో వైఎస్ జగన్ పర్యటించినప్పుడు ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. జగన్ ప్రయాణిస్తున్న కారు కింద పడి సింగయ్య అనే వృద్ధుడు మరణించారు. మొదట కాన్వాయ్‌లోని మరో వాహనం ఢీకొట్టిందని వార్తలు వచ్చినా, కొద్ది రోజుల తర్వాత జగన్ ప్రయాణిస్తున్న కారు కిందే ఆయన పడినట్లుగా ఉన్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమయ్యాయి. ఈ వీడియోల ఆధారంగా పోలీసులు మాజీ ముఖ్యమంత్రి జగన్‌తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఈ కేసును రద్దు చేయాలని జగన్ హైకోర్టును ఆశ్రయించగా, ప్రస్తుతం ఆయనకు తాత్కాలిక ఊరట లభించింది.


More Telugu News