Operation Sundar: ఆపరేషన్ సిందూర్.. పాకిస్థాన్‌లోని తమ పౌరులకు అమెరికా అడ్వైజరీ

భారతదేశం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' అనంతరం పాకిస్థాన్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా, అక్కడున్న తమ దేశ పౌరులకు అమెరికా ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది. పాకిస్థాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. సాయుధ దళాల మధ్య ఘర్షణలు తలెత్తే ఆస్కారం ఉన్నందున, భారత్-పాకిస్థాన్ మధ్య ఉన్న నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) సమీప ప్రాంతాలకు ప్రయాణాలు పెట్టుకోవద్దని తమ పౌరులను హెచ్చరించింది.

పాకిస్థాన్‌లోని పరిస్థితులను, ఇరు దేశాల గగనతలాల మూసివేత వంటి పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని అమెరికా అధికారులు తెలిపారు. దాడులు జరిగిన ప్రాంతాలకు దగ్గరగా నివసిస్తున్న వారు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లి ఆశ్రయం పొందాలని సూచించారు. అంతేకాకుండా, వివాదాస్పద ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారు తమ ప్రయాణ ప్రణాళికలను రద్దు చేసుకోవాలని అడ్వైజరీలో స్పష్టం చేశారు.

'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ జరిపిన దాడుల అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ ఘర్షణ వాతావరణానికి వీలైనంత త్వరగా తెరపడాలని ఆయన ఆకాంక్షించారు. "రెండు శక్తిమంతమైన దేశాల మధ్య యుద్ధాన్ని ఎవరూ కోరుకోరు. భారత్, పాకిస్థాన్‌లకు గొప్ప చరిత్ర ఉంది. వాటి మధ్య అనేక ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, ప్రపంచానికి శాంతి మాత్రమే కావాలి. ఘర్షణలు వద్దు" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

మరోవైపు, అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ఈ దాడులపై వివరణ ఇచ్చింది. "ప్రాణాలతో బయటపడిన వారి సాక్ష్యాధారాలు, సాంకేతిక సమాచారం ఆధారంగానే భారత్.. పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేపట్టింది. ఇందుకు స్పష్టమైన ఆధారాలున్నాయి. ఈ దాడుల్లో అక్కడి పౌర ఆవాసాలు, ఆర్థిక వనరులు లేదా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదు. కేవలం ఉగ్రవాద శిబిరాలపైనే దాడులు జరిగాయి" అని భారత రాయబార కార్యాలయ వర్గాలు తెలిపాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో, 'ఆపరేషన్ సిందూర్' అనంతరం పాకిస్థాన్ ప్రభుత్వం భారత రాయబారికి సమన్లు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
Operation Sundar
US Advisory
Pakistan
India
Donald Trump
India-Pakistan tensions
LOC
Terrorist Camps
US Embassy Pakistan
India Embassy US

More Telugu News