భారత విజ్ఞానమే పాశ్చాత్య ఆవిష్కరణలుగా మళ్లీ స్వదేశానికి తిరిగొచ్చింది: ఇస్రో చీఫ్
- మహర్షి పాణిని సంస్కృత, వైదిక విశ్వవిద్యాలయంలో బుధవారం కాన్వకేషన్
- కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ఇస్రో చీఫ్ సోమ్నాథ్
- వేదం కాలం నుంచి భారత్ ఓ వైజ్ఞానిక సమాజమని వ్యాఖ్య
- వేల ఏళ్ల తరువాత ఆ విజ్ఞానమే పాశ్చాత్య ఆవిష్కరణలుగా భారత్కు తిరిగొచ్చిందని వెల్లడి
- శృతి ప్రధానమైన సంస్కృతం ఎంతో వినసొంపైన భాష అని వ్యాఖ్య
‘‘నేను చూసిన తొలి సంస్కృత పుస్తకం సూర్య సిద్ధాంతం. వృత్తిపరంగా నాకు తెలిసిన పలు అంశాలు ఇందులో ఉన్నాయి. సౌర వ్యవస్థ గురించి ఈ పుస్తకం ప్రధానంగా చర్చించింది. సూర్యుడి చుట్టూ గ్రహాలు ఎలా పరిభ్రమిస్తాయి? ఈ పరిభ్రణల కాలవ్యవధి తదితర అంశాలు ఇందులో ఉన్నాయి. భారత్లోని ఈ విజ్ఞానమంతా అరబ్బుల ద్వారా ఐరోపా చేరుకుంది. కొన్ని వేల ఏళ్ల తరువాత మళ్లీ పాశ్చాత్య శాస్త్రవేత్తల ఆవిష్కరణల రూపంలో భారత్కు వచ్చింది. అనంతం(Infinity), శూన్యం(Zero) అన్న భావనలను మహర్షులు ఎప్పుడో కనుగొన్నారు. ఆల్జీబ్రా, ఫైథాగోరస్ థియరమ్ వంటి వాటిని పద్యశైలిలో అత్యంత కచ్చితత్వంతో సంస్కృతంలో రాసుకొచ్చారు. విమానాలు, భవననిర్మాణం, కాలం అనే భావన, విశ్వ నిర్మాణం, పరిణామక్రమం, లోహం ఉత్పత్తి, రసాయన శాస్త్రం, వైద్యం, భాష, వ్యాకరణం, న్యాయ, సంగీత శాస్త్రాలు, యోగా వంటివన్నీ ఎంతో అందంగా సంస్కృతంలో రాశారు’’ అని ఆయన చెప్పారు. సంస్కృతం శృతి ప్రధానమైన భాష అని చెప్పిన సోమ్నాథ్, వినసొంపైన భాషల్లో ఇదీ ఒకటి అని తెలిపారు. ఈ లక్షణం కారణంగానే సంస్కృతం ఇన్నాళ్ల పాటు మనగలిగిందని చెప్పారు.