Arvind Kejriwal: కేజ్రీవాల్‌‌పై బీజేపీ నేతల ఉగ్రవాది ముద్ర.. తీవ్రంగా స్పందించిన కుమార్తె హర్షిత

  • కేజ్రీవాల్‌ లాంటి ఉగ్రవాది దేశానికి ప్రమాదకరమన్న బీజేపీ ఎంపీ
  • ఉదయాన్నే నిద్రలేపి భగవద్గీత నేర్పిన తన తండ్రి ఉగ్రవాదా? అని ప్రశ్నించిన కుమార్తె
  • ప్రజావసరాలు తీర్చడం ఉగ్రవాదమా? అని నిలదీత

ఉగ్రవాది అంటూ కేజ్రీవాల్‌పై బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారంపై ఆయన కుమార్తె హర్షిత కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. ఉదయాన్నే నిద్రలేపి తనకు భగవద్గీత నేర్పిన తన తండ్రి ఉగ్రవాదా? అని ప్రశ్నించారు. మరో మూడు రోజుల్లో ఢిల్లీలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ శతాబ్దపు తొలి ఎన్నికలైన వీటిలో విజయం సాధించాలని అటు కేజ్రీవాల్ సారథ్యంలోని ‘ఆప్’, భారతీయ జనతాపార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆప్, బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించుకుంటున్నారు.

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ ఎంపీ పర్వేష్‌ సాహిబ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. కేజ్రీవాల్ వంటివారు దేశానికి ప్రమాదకరమని, ఆయనో ఉగ్రవాది అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పర్వేష్ వ్యాఖ్యలపై కేజ్రీవాల్ కుమార్తె హర్షిత స్పందించారు. తనను, తన సోదరుడిని తెల్లవారుజామునే నిద్రలేపి భగవద్గీత చదివి వినిపించే తన తండ్రి ఉగ్రవాది ఎలా అవుతారని నిలదీశారు. ‘భగవద్గీత నేర్పిన నా తండ్రి ఉగ్రవాదా? పేదలకు ఉచిత వైద్య సౌకర్యాలు కల్పిస్తూ, విద్యుత్, తాగునీటి సరఫరాను మెరుగుపరుస్తూ ముందుకు సాగుతున్న నా తండ్రి ఉగ్రవాదా? ప్రజల అవసరాలను తీర్చడం ఉగ్రవాదమా? అని హర్షిత ప్రశ్నల వర్షం కురిపించారు.

More Telugu News