NTR: మండలిని ఎన్టీఆర్ రద్దు చేయడానికి కారణం ఇదే: ఐవైఆర్ కృష్ణారావు

  • మండలిలో రోశయ్య ధాటికి ఎన్టీఆర్ తట్టుకోలేకపోయారు
  • ఇందిరాగాంధీ వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు
  • దూకుడు కొనసాగించాలని రోశయ్యకు ఇందిర సూచించారు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శాసనమండలిని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా ఏపీలో మండలి రద్దుకు ఏపీ ప్రభుత్వం యత్నిస్తోందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో, అప్పుడు మండలి రద్దు ఎలా జరిగిందన్న వివరాలను ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

'ఎన్టీ రామారావు గారి సమయంలో నేను ఆర్థిక శాఖలో ఉన్నప్పుడు మండలి రద్దుపై ఆనాటి శాసనమండలి సభ్యులు కొణిజేటి రోశయ్యగారు చెప్పిన ఒక ఉదంతం గుర్తుకు వస్తోంది. రోశయ్యగారి ధాటికి తట్టుకోలేక రామారావు గారు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దగ్గరకు పోయి ఆయనను నియంత్రించమని మొరపెట్టుకున్నారు. ఆమె చూస్తానని హామీ ఇచ్చి పంపించారు.

తిరుగు ప్రయాణంలో రామారావు గారితో పాటు  ప్రయాణం చేసిన రామానాయుడు గారికి... అతి త్వరలో రోశయ్య గారికి పిలుపు వస్తుందని, చీవాట్లు పడటం ఖాయమని ఎన్టీఆర్ చెప్పారు. రామానాయుడు గారు ఈ విషయం చెప్పడంతో రోశయ్య గారు కలవరపడ్డారు. అనుకున్నట్లే ఇందిరా గాంధీ గారి నుంచి పిలుపు వచ్చింది. ఇందిరను రోశయ్య కలిసినప్పుడు ఏ విధంగానూ తగ్గాల్సిన అవసరం లేదని, నీ ఉద్ధృతిని అదేవిధంగా కొనసాగించాలని సలహా ఇచ్చి పంపించారు. దాంతో కొన్నాళ్లకు మండలిని ఎన్టీఆర్ రద్దు చేశారు' అని ఐవైఆర్ తెలిపారు.

More Telugu News