Sujana Chowdary: కమిటీ రిపోర్ట్ చూస్తుంటే విశాఖను రాజధాని చేయాలని సూచిస్తున్నట్టుంది: సుజనా

  • జీఎన్ రావు కమిటీ నివేదికపై సుజనా స్పందన
  • ఏపీ రాజధానిపై అయోమయం
  • మూడు రాజధానులంటున్న సీఎం జగన్
  • నాలుగు ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలంటున్న జీఎన్ రావు కమిటీ

ఏపీకి మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు, ఆపై వైసీపీ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర విమర్శల పాలవుతున్నాయి. దానికి తోడు అగ్నికి ఆజ్యం పోస్తున్నట్టుగా జీఎన్ రావు కమిటీ నివేదిక వచ్చింది. రాష్ట్రాన్ని నాలుగు భాగాలుగా విభజించి అభివృద్ధి చేయాలని కమిటీ సూచించింది. దీనిపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి స్పందించారు. కమిటీ రిపోర్ట్ ను పరిశీలిస్తే విశాఖను రాజధానిగా చేయాలని సూచిస్తున్నట్టుగా ఉందని అభిప్రాయపడ్డారు. అయితే రాజధానికి కేంద్రం నిధులు ఇచ్చింది కాబట్టి మార్పుపై ప్రశ్నించే హక్కు ఉందని స్పష్టం చేశారు.

ఇక మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, 3 రాజధానులు కాకపోతే 33 రాజధానులు పెట్టుకుంటామనడం మరీ విడ్డూరంగా ఉందని అన్నారు. రాజధాని రైతుల జీవితాలతో చెలగాటమాడవద్దు అని హితవు పలికారు. చంద్రబాబు ఇప్పటికే ఐదేళ్లు వృధా చేశారని, ఇప్పుడు వైసీపీ మళ్లీ మొదటికి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News