Nidhi agarwal: టీచర్‌గా మారిన నటి నిధి అగర్వాల్.. బంజారాహిల్స్ సర్కారు బడిలో పాఠాలు

  • ఎన్‌బీటీ నగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ బోధించిన నిధి
  • ‘పెగా టీచ్ ఫర్ చేంజ్’ కార్యక్రమంలో పాల్గొన్న నటి
  • హ్యాపీగా ఉందన్న నిధి అగర్వాల్

టాలీవుడ్ నటి నిధి అగర్వాల్ టీచర్‌గా మారిపోయింది. విద్యార్థులకు పాఠాలు చెప్పి మెప్పించింది. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఇంగ్లిష్‌లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ‘పెగా టీచ్ ఫర్ చేంజ్’ అనే స్వచ్ఛంద సంస్థ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా గురువారం బంజారాహిల్స్ రోడ్డు నంబరు 12లోని ఎన్‌బీటీనగర్‌లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన నటి నిధి మూడో తరగతి విద్యార్థులకు ఆంగ్ల పాఠాలు బోధించింది. దాదాపు గంటపాటు పాఠాలు చెప్పి మెప్పించింది.

కార్యక్రమం అనంతరం నిధి మాట్లాడుతూ.. ఇలాంటి మంచి కార్యక్రమంలో తాను పాలుపంచుకోవడం ఆనందంగా ఉందని పేర్కొంది. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న సంస్థను అభినందించింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ఇంగ్లిష్‌లో మాట్లాడేలా తీర్చిదిద్దేందుకు ప్రముఖులతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు పెగా సిస్టమ్స్ ఎండీ సుమన్‌రెడ్డి తెలిపారు.  

More Telugu News