Sujana Chowdary: 20 మంది టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీతో టచ్ లో ఉన్నారు: సుజనా చౌదరి

  • ఇప్పటికిప్పుడే బీజేపీలో ఎవరినీ చేర్చుకోము
  • పవన్ కల్యాణ్ నాతో టచ్ లో లేరు
  • ఏపీలో బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది

ఏపీకి చెందిన పలువురు వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ పార్టీతో టచ్ లో ఉన్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి చెందిన మొత్తం 20 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని తెలిపారు. కానీ ఎవరినీ ఇప్పటికిప్పుడు బీజేపీలో చేర్చుకోబోమని... సమయం, సందర్భం వచ్చినప్పుడే వారిని తమ పార్టీలో చేర్చుకుంటామని చెప్పారు.

పార్లమెంటులో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు భుజం మీద చేయి వేసి 'రాజు గారు' అంటూ ప్రధాని మోదీ పలకరించడంపై స్పందిస్తూ, నమస్కారం పెట్టిన వారికి ప్రతినమస్కారం చేయడం మోదీ సంస్కారమని సుజనా చౌదరి చెప్పారు. ఇందులో చర్చించుకోవడానికి ఏమీ లేదని అన్నారు. దీనిపై రకరకాలుగా ఊహించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీ నేతలతో ఎవరితో టచ్ లో ఉన్నారో తనకు తెలియదని సుజనా చౌదరి తెలిపారు. తనతో మాత్రం ఆయన టచ్ లో లేరని స్పష్టం చేశారు. ఇతర పార్టీలతో పొత్తుల కోసం తాము ఇప్పటి నుంచే వెంపర్లాడటం లేదని చెప్పారు. ఏపీలో అధికారాన్ని చేపట్టడానికి బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. ఏపీకి బీజేపీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు.

More Telugu News