Train delay: విరిగిన రైలు పట్టా...ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం

  • శ్రీకాకుళం జిల్లా తిలారు స్టేషన్‌ సమీపంలో ఘటన
  • మూడు బోగీలు దాటాక ఆగిన రైలు
  • నలభై నిమిషాలపాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం

పెను ప్రమాదం తప్పింది. రైలు పట్టా విరిగిన విషయం సకాలంలో గుర్తించడంతో ఎక్స్‌ప్రెస్‌ రైలుకు ప్రమాదం తప్పింది. అయితే అప్పటికే రైలు ఇంజిన్‌తోపాటు మూడు బోగీలు కూడా విరిగిన పట్టాను దాటి వెళ్లిపోయాయి. అయినప్పటికీ ఎటువంటి ప్రమాదం జరగక పోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే... దిగా నుంచి విశాఖపట్నానికి దిగా సూపర్ ఫాస్ట్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలు వెళ్తోంది.

శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం తిలారు రైల్వేస్టేషన్‌ సమీపంలో రైలు పట్టా విరిగిన విషయాన్ని ఈ రైలు లోకో పైలట్‌ గుర్తించాడు. అప్పటికే ఇంజిన్‌తోపాటు మూడు బోగీలు కూడా విరిగిన పట్టాలపై నుంచి వెళ్లిపోయాయి. అయినా లోకో పైలట్‌ చాకచక్యంగా రైలును నిలిపి వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

దారి మధ్యలో రైలు హఠాత్తుగా నిలిచిపోవడంతో ఏం జరిగిందో అర్థంకాక కాసేపు అయోమయానికి గురైన ప్రయాణికులు అనంతరం విషయం తెలుసుకుని ఏమీ జరగనందుకు ఊపిరిపీల్చుకున్నారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని అవసరమైన మరమ్మతులు చేపట్టారు.

ఈ కారణంగా దాదాపు 40 నిమిషాలపాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దిగా నుంచి విశాఖకు రైలు వెళ్లిపోయాక అధికారులు పూర్తి స్థాయి చర్యలు చేపట్టారు.

More Telugu News