kamlesh tiwari: కత్తితో పొడిచినా చావలేదని తుపాకితో కాల్చారు.. హిందూ సమాజ్ పార్టీ నేత పోస్టుమార్టం నివేదిక వెల్లడి!

  • గత శుక్రవారం పార్టీ కార్యాలయంలోనే హత్య
  • మిఠాయిలు ఇచ్చేందుకు వచ్చి కత్తితో నరికి చంపిన దుండగులు
  • ఇప్పటి వరకు ఆరుగురి అరెస్ట్

హిందూ సమాజ్‌ పార్టీ నేత కమలేశ్ తివారీ హత్యకేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత శుక్రవారం ఆయన తన కార్యాలయంలో ఉండగా, మిఠాయిలు ఇచ్చేందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆయనను కత్తితో పొడిచి, ఆపై తుపాకితో కాల్చి చంపారు. తాజాగా, కమలేశ్ పోస్టుమార్టం నివేదిక వివరాలను వైద్యులు వెల్లడించారు. కమలేశ్ ముఖం భాగంలో దుండగులు 15సార్లు కత్తితో విచక్షణ రహితంగా పొడిచారని, రెండుసార్లు మెడభాగంలో కత్తితో కోశారని పోస్టుమార్టంలో తేలిందన్నారు. అయినప్పటికీ ఆయన బతికే ఉన్నారని భావించిన నిందితులు తుపాకితో నుదిటిపై కాల్చారని పేర్కొన్నారు.

ఈ కేసులో నిన్న ఉదయం సూరత్‌కు చెందిన అష్ఫాక్ హుస్సేన్, మోయిదీన్ పఠాన్‌లను అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయినవారి సంఖ్య ఆరుకు చేరింది. హత్యకు ముందు రోజు రాత్రి లక్నోలో తమ అసలు పేర్లతో హోటల్‌లో గదిని అద్దెకు తీసుకున్న నిందితులు, హత్య అనంతరం దుస్తులు, హత్యకు ఉపయోగించిన కత్తిని హోటల్ గదిలోనే ఉంచి సూరత్‌కు వెళ్లిపోయినట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News