Ayodhya: అయోధ్య కేసులో కీలక మలుపు.. స్థలాన్ని వదులుకోవడానికి 3 షరతులు విధించిన సున్నీ వక్ఫ్ బోర్డు!

  • దేశంలోని అన్ని మసీదులకు రక్షణ కల్పించాలి
  • అయోధ్యలో మరో ప్రాంతంలో పెద్ద మసీదు కట్టుకునేందుకు అనుమతించాలి
  • అయోధ్యలోని 22 పాత మసీదుల మరమ్మతులకు సహకరించాలి

అయోధ్య రామజన్మభూమి - బాబ్రీ మసీదు వివాదాస్పద స్థలానికి సంబంధించిన కేసు విచారణను సుప్రీంకోర్టు నిన్న సాయంత్రం ముగించింది. ఈ కేసుకు సంబంధించి వినడానికి ఇంకేమీ లేదంటూ విచారణ ముగింపు సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ప్రస్తుతం తుది తీర్పు మాత్రమే పెండింగ్ లో ఉంది.

మరోవైపు, నిన్నటి వాదనల సందర్భంగా కక్షిదారుల్లో ఒకటైన సున్నీ వక్ఫ్ బోర్డు ఓ సంచలన ప్రతిపాదన చేసింది. వివాదాస్పద స్థలంపై తమకున్న హక్కును వదులుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. కానీ, అందుకు మూడు షరతులు విధించింది.

సున్నీ వక్ఫ్ బోర్డు విధించిన షరతులు:

  • దేశంలో ఉన్న మసీదులన్నింటికీ రక్షణ కల్పించాలి. 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలి. కబ్జాలు, విధ్వంసాలు జరగకుండా చూడాలి.
  • బాబ్రీకి ప్రతిగా అయోధ్యలోనే మరో చోట ఒక పెద్ద మసీదును కట్టుకునేందుకు అనుమతించాలి. అయోధ్యలో ఉన్న 22 పాత మసీదుల మరమ్మతులకు సహకారం అందించాలి.
  • పురావస్తు శాఖ అధీనంలో ఉన్న మసీదుల్లో కూడా ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించాలి.

ఈ మేరకు వాదనల చివరి రోజున మధ్యవర్తిత్వ కమిటీ ద్వారా తన ప్రతిపాదనను సుప్రీంకోర్టుకు సున్నీ వక్ఫ్ బోర్డు పంపించింది. ఈ ప్రతిపాదనలపై సున్నీ వక్ఫ్ బోర్డుతో పాటు కొన్ని హిందూ పక్షాలు కూడా సంతకం చేసినట్టు తెలుస్తోంది. ఈ సెటిల్మెంట్ ప్రతిపాదనను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పరిశీలించనుంది.

More Telugu News