Maniratnam: మణిరత్నం సహా 49 మంది సెలబ్రిటీలపై దేశద్రోహం కేసు

  • మూక దాడులపై ప్రధాని మోదీకి బహిరంగ లేఖ
  • ముస్లింలు, దళితులు, మైనార్టీల హత్యలను ఆపాలంటూ డిమాండ్
  • జైశ్రీరాం నినాదాన్ని దిగజార్చారంటూ మండిపాటు

మూక దాడులపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాసిన 49 మంది సెలబ్రిటీలపై బిహార్ లోని ముజఫర్ పూర్ లో కేసు నమోదైంది. వీరిపై దేశద్రోహ ఆరోపణలతో కేసును నమోదు చేశారు. కేసు నమోదైన వారిలో సినీ దర్శకుడు మణిరత్నం, రామచంద్ర గుహ, అపర్ణా సేన్, శ్యామ్ బెనగళ్, అనురాగ్ కశ్యప్, సౌమిత్ర ఛటర్జీ తదితరులు ఉన్నారు. ముస్లింలు, దళితులు, ఇతర మైనార్టీలపై మూక హత్యలను వెంటనే ఆపాలని వీరు లేఖలో పేర్కొన్నారు. అసమ్మతి లేకుండా ప్రజాస్వామ్యం ఉండదని తెలిపారు. జై శ్రీరాం నినాదాన్ని రెచ్చగొట్టేందుకు ఉపయోగించే స్థాయికి దిగజార్చారని మండిపడ్డారు.

అయితే, ఈ లేఖపై స్థానిక న్యాయవాది సుధీర్ కుమార్ ఓఝా ముజఫర్ పూర్ కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ ను విచారించిన చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ సూర్యకాంత్ తివారీ వీరందరిపై కేసు నమోదు చేయాలని రెండు నెలల క్రితం ఆదేశాలు జారీ చేచేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

లేఖపై సంతకాలు చేసిన 50 మంది వ్యక్తులను నిందితులుగా పేర్కొంటూ తాను పిటిషన్ వేశానని ఈ సందర్భంగా సుధీర్ కుమార్ తెలిపారు. దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా, ప్రధాని కార్యదక్షతను కించపరిచేలా వీరు వ్యవహరించారని చెప్పారు. కోర్టు ఆదేశాల మేరకు వీరిపై దేశద్రోహం, పబ్లిక్ న్యూసెన్స్, మత విశ్వాసాలకు విఘాతం కలిగించడం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

More Telugu News