vizag: అనకాపల్లిలో ప్రేమోన్మాది ఘాతుకం.. విద్యార్థినిపై దాడి!

  • విశాఖ జిల్లాలోని అనకాపల్లిలో నడిరోడ్డుపై ఘటన
  • డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని
  • ఆమె గొంతు, ఛాతీపై స్క్రూ డ్రైవర్ తో దాడికి పాల్పడ్డ ప్రేమోన్మాది

తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో నడిరోడ్డుపైనే ఓ విద్యార్థినిపై ప్రేమోన్మాది దాడి చేసిన దారుణ ఘటన విశాఖపట్టణం జిల్లాలోని అనకాపల్లిలో జరిగింది. స్థానిక కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న విశ్వభార్గవిని తనను ప్రేమించమంటూ కొన్ని రోజులుగా సాయి కిరణ్ అనే కుర్రాడు వేధిస్తున్నాడు. తన వెంట పడుతున్నఅతన్ని విశ్వభార్గవి పట్టించుకోకపోవడంతో రగిలిపోతున్న సాయి ఆమెపై ఈ రోజు దాడి చేశాడు.

తన వెంట తెచ్చుకున్న స్కూడ్రైవర్ తో ఆమె గొంతు, ఛాతీపై పొడిచాడు. తీవ్రంగా గాయపడ్డ ఆమె కుప్పకూలిపోయింది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే సాయి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనను గమనించిన స్థానికులు సాయిని పట్టుకుని చితకబాదారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, గాయపడ్డ విశ్వభార్గవిని సమీప ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

More Telugu News