T-congress: ఆయుర్వేద వైద్య విద్యార్థుల ఆందోళన.. పోలీసు అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి: విజయశాంతి డిమాండ్

  • పోలీసులు అనుచితంగా వ్యవహరించారు
  • సభ్య సమాజం తలవంచుకునే విధంగా ఉంది
  • మా డిమాండ్ ను పట్టించుకోకపోతే తిరుగుబాటు తప్పదు  

ఆయుర్వేద వైద్య విద్యార్థుల ఆందోళన సందర్భంగా వారి పట్ల హైదరాబాద్ పోలీసులు అనుచితంగా, అసభ్యంగా వ్యవహరించిన తీరు సభ్య సమాజం తలవంచుకునే విధంగా ఉందని టీ-కాంగ్రెస్ నేత, ప్రముఖ సినీ నటి విజయశాంతి అన్నారు. ఈ ఘటనను చూసిన తర్వాత మహిళలు, విద్యార్థుల విషయంలో టీఆర్ఎస్ అధినాయకత్వానికి, పాలకులకు ఎంత చులకన భావమో మరోసారి అర్థమవుతోందని విమర్శించారు.

ఓ అనామక సంస్థకు టెండర్లు అప్పగించి ఇంటర్ విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న విషయాన్ని ఇంకా ఎవరూ మరిచిపోలేదని, విధి నిర్వహణలో ఉన్న అటవీశాఖకు చెందిన మహిళా ఉద్యోగిపై టీఆర్ఎస్ కి చెందిన ఎమ్మెల్యే సోదరుడు ఆటవికంగా దాడి చేసినా, కేసీఆర్ ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా తేలికగా తీసుకుందని విమర్శించారు. ఇప్పుడు ఆయుర్వేద కళాశాలకు చెందిన విద్యార్థినులపై పోలీసులు ప్రవర్తించిన తీరు పట్ల యావత్ రాష్ట్రం అట్టుడికిపోతున్నప్పటికీ టీఆర్ఎస్ పాలకులకు మాత్రం చీమ కుట్టినట్లు కూడా అనిపించడంలేదని ఘాటు విమర్శలు చేశారు.

మహిళల భద్రత కోసం షీ టీంలను ఏర్పాటు చేశామని చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్, విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోలీసు అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. ప్రతిపక్షాలు చేసే విమర్శలను, వారి వాదనను పట్టించుకోవాల్సిన అవసరం లేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు. ఈ విషయంలో తాము చేసే డిమాండ్ ని పట్టించుకోకపోతే, మహిళల నుంచి వచ్చే తిరుగుబాటు ఎలా ఉంటుందో రుచి చూడాల్సి ఉంటుందని ఓ పోస్ట్ లో విజయశాంతి హెచ్చరించారు.

More Telugu News