Andhra Pradesh: వైసీపీ ప్రభుత్వానికి రెండు రోజుల సమయమిస్తున్నా.. బాధ్యులపై చర్యలు తీసుకోండి: చంద్రబాబు డిమాండ్

- టీడీపీ నేతలపై 285 దాడులు, 7 హత్యలు జరిగాయి!
- పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదు?
- ఈ ఘటనలు సీఎం, హోం మంత్రికి కనిపించడం లేదా?
వైసీపీ నేతలపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ నేతలు సమాజంలో అభద్రతా భావం సృష్టిస్తున్నారని, టీడీపీ నేతలపై ఇప్పటివరకు 285 దాడులు, 7 హత్యలు జరిగాయని అన్నారు. ఫిరంగిపురానికి సమీపంలోని ఓ గ్రామంలో రోడ్డుకు అడ్డంగా గోడ కట్టడం వైసీపీ దౌర్జన్యాలకు పరాకాష్ట అని విరుచుకుపడ్డారు. ఈ ప్రభుత్వానికి రెండు రోజుల సమయం ఇస్తున్నామని, బాధ్యులపై చర్యలు తీసుకోకుంటే గోడ కట్టిన ప్రదేశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ఇన్ని జరుగుతున్నా పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఈ ఘటనలు సీఎం, హోం మంత్రికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.
పల్నాడులోని గ్రామాల్లో ఉన్న టీడీపీ సానుభూతిపరులను ఖాళీ చేయిస్తున్నారని, ఈ విషయమై ఫిర్యాదు చేస్తే ఎస్పీ నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారని విమర్శించారు. మంత్రి పేర్ని నాని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి మహిళ ఆత్మహత్య చేసుకుందని, నాని అరాచకాలు సీఎం జగన్ కు కనిపించలేదా? అని ప్రశ్నించిన చంద్రబాబు, టీడీపీ నేతలకు ఏదైనా జరిగితే సీఎందే బాధ్యత అని అన్నారు. టీడీపీ నేతలపై జరుగుతున్న దాడుల గురించి, కరవు ప్రాంతాల గురించి శాసనసభలో చర్చిద్దామంటే వినలేదంటూ వైసీపీ ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు.