Bhuavangiri: రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు: ఎంపీ కోమటిరెడ్డి

  • నేను బీజేపీలో చేరతానన్న వ్యాఖ్యలు కరెక్టు కాదు
  • కుటుంబం వేరు, రాజకీయాలు వేరు
  • నా తుదిశ్వాస వరకూ ‘కాంగ్రెస్’లోనే ఉంటా
భువనగిరి ఎంపీ, తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి త్వరలో బీజేపీలో చేరతారని ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి ఇటీవల వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని వెంకటరెడ్డి స్పష్టం చేశారు. కుటుంబం వేరు, రాజకీయాలు వేరని అన్నారు. ఎందరో ప్రముఖుల కుటుంబసభ్యులు వేర్వేరు పార్టీల్లో కొనసాగుతున్నారని చెప్పిన కోమటిరెడ్డి, తన తుదిశ్వాస వరకూ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని అన్నారు.  

సంగారెడ్డిలో నిర్వహించిన కాంగ్రెస్ నేతల సమావేశంలో వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీఆర్ఎస్ పెంచిన పెన్షన్లపై హడావుడి చేస్తోందని విమర్శించారు. మున్సిపల్  ఎన్నికల్లో సీఎం కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. నల్గొండ జిల్లా సమస్యలపై కేంద్ర మంత్రులను కలిశానని చెప్పారు. నల్లగొండ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై టీఆర్ఎస్ ప్రభుత్వం శీతకన్ను వేసిందని, ఆగస్టులో జలసౌధ వరకు పాదయాత్ర, ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంపై సెప్టెంబర్ లో ఉద్యమం నిర్వహిస్తామని ప్రకటించారు. తక్షణమే మంత్రులకు రెవెన్యూ, మున్సిపల్ శాఖలు కేటాయించాలని డిమాండ్ చేశారు. 

More Telugu News

Bhuavangiri
congress
mp
komatireddy