Andhra Pradesh: ఇద్దరు రైతులను చంద్రబాబు, నారాయణ బెదిరించారు.. ‘ప్రజావేదిక’ స్థలాన్ని లాక్కున్నారు!: ఆళ్ల రామకృష్ణారెడ్డి

  • దాసరి నాగయ్య, సాంబశివరావుపై తీవ్రంగా ఒత్తిడి చేశారు
  • హైకోర్టు నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదు
  • అమరావతిలో మీడియాతో మంగళగిరి ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణానది కరకట్టపై నిర్మించిన ప్రజావేదికను ప్రస్తుతం కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇటు వైసీపీ, అటు టీడీపీల మధ్య మాటలయుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజావేదిక వద్దకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేరుకున్నారు. పనులను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజావేదికను నిర్మించిన స్థలం రైతులను బెదిరించి బలవంతంగా లాక్కుకున్నారని ఆళ్ల తెలిపారు.

ఈ స్థలం ఇవ్వాలని అప్పటి సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ లు రైతులు దాసరి నాగయ్య, దాసరి సాంబశివరావులపై తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చారని ఆరోపించారు.చివరికి బెదిరించి సదరు స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. సీఆర్‌డీఏ పరిధిలోని అక్రమ నిర్మాణాలకు సంబంధించి 2015లో తహసీల్దార్‌, 2016లో హైకోర్టు నోటీసులు ఇచ్చాయన్నారు. అయినా వాటిని చంద్రబాబు పట్టించుకోలేదనీ, అక్రమ నిర్మాణాలు కొనసాగించారని చెప్పారు. ప్రజావేదిక కూల్చివేతపై రాద్ధాంతం అనవసరమని, చట్టాలకు ఎవరూ అతీతులు కాదని స్పష్టం చేశారు.

More Telugu News