kolkata: ఆ రెండు కేసుల్లో ముస్లిం నిందితులను వదిలిపెట్టొద్దు!: మమతకు ముస్లింల లేఖ

  • వైద్యులపై దాడి, మాజీ మిస్ ఇండియా యూనివర్స్‌పై దాడి కేసుల్లో ముస్లింలపై ఆరోపణలు
  • వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ముస్లింల లేఖ
  • వారిని శిక్షించడం ద్వారా ప్రభుత్వంపై ఉన్న అపవాదును కడిగేసుకోవాలని సూచన

ముస్లిం కమ్యూనిటీ నుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అనూహ్యమైన మద్దతు లభించింది. ఎన్ఆర్ఎస్ ఆసుపత్రిలో వైద్యులపై దాడి చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముస్లింలు, మాజీ మిస్ ఇండియా యూనివర్స్, మోడల్ ఉషోషి సేన్‌గుప్తాలపై దాడి చేసిన ముస్లిం నిందితులను వదిలిపెట్టవద్దంటూ కోల్‌కతాలోని ముస్లింలు మమతకు లేఖ రాశారు. ఫలితంగా తాము ఏ ఒక్క మతానికో వత్తాసు పలకడం లేదని, ఆ మతాన్ని సంతృప్తి పరిచేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నించడం లేదని నిరూపించుకోవాలని లేఖలో కోరారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

‘‘దశాబ్దాల తరబడి మేం ఇక్కడే జీవిస్తున్నాం. ఇటీవల జరిగిన ఈ రెండు ఘటనలు మమ్మల్ని చాలా బాధించాయి. వైద్యులపైనా, నటి ఉషోషీపైనా జరిగిన దాడి బాధాకరం. ఈ రెండు ఘటనల్లోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు మా మతానికి చెందినవారే. ఈ ఘటనలకు చాలా చింతిస్తున్నాం. నిందితులపై చర్యలు తీసుకోవడం ద్వారా మీ ప్రభుత్వంపై ఉన్న మచ్చను చెరిపేసుకోండి’’ అని కోల్‌కతా ముస్లింలు తమ లేఖలో పేర్కొన్నారు. వారు ముస్లింలన్న కారణంతో విడిచిపెట్టవద్దని, ఫలితంగా ఒక్క మతానికే తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్న అపవాదును తొలగించుకోవాలని కోరారు.

More Telugu News