Kodela: నరసరావుపేట నుంచి అదృశ్యమైన కోడెల కుమారుడు, కుమార్తె... పోలీసుల గాలింపు!

  • శివరామ్, విజయలక్ష్మిపై ఐదు కేసుల నమోదు
  • రెండు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా
  • విచారించాలని భావిస్తున్న పోలీసులు
  • విషయం తెలిసి కనిపించకుండా పోయిన ఇద్దరూ

'కే-టాక్స్' పేరిట నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల పరిధిలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామ్, కుమార్తె విజయలక్ష్మి చేసిన దందాలపై పోలీసు కేసులు నమోదైన వేళ, వారు పట్టణం నుంచి అదృశ్యమయ్యారు. వీరిపై ఇప్పటివరకూ మొత్తం ఐదు కేసులు నమోదుకాగా, వాటిల్లో రెండు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా ఉన్నాయి.

భూ కబ్జా, నకిలీ పత్రాల తయారీ, బెదిరింపులు, కులదూషణలు చేసినట్టు ఆరోపణలు రావడంతో, వీరిపై పలు సెక్షన్ల కింద కేసు పెట్టిన పోలీసులు విచారణ చేపట్టారు. వారిపై వచ్చిన ఆరోపణలకు ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయని భావించిన పోలీసులు, నోటీసులు ఇచ్చి విచారించేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో, విషయం తెలిసి శివరామ్, విజయలక్ష్మిలు నరసరావుపేటను వీడినట్టు సమాచారం. వీరిద్దరూ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉండగా, వారికోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. సాధ్యమైనంత త్వరలో వారికి నోటీసులు ఇచ్చి విచారిస్తామని పోలీసు ఉన్నతాధికారులు వ్యాఖ్యానించారు.

More Telugu News