Vijayawada: ఇళ్లల్లో చోరీలు చేసే అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు!

  • నాయకుడు భూక్యా నాయక్, గ్యాంగ్ సభ్యుల అరెస్టు 
  • 1258 గ్రాముల బంగారం, 17.2 కిలోల వెండి స్వాధీనం
  • విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడి 

అనేక నేరాలకు పాల్పడ్డ అంతర్రాష్ట్ర దొంగల ముఠాను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. రూ.54 లక్షల విలువ చేసే 1258 గ్రాముల బంగారం, 17.2 కిలోల వెండితో పాటు 9.65 లక్షల నగదు, ఒక ల్యాప్ టాప్, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ, ఇళ్లల్లో చోరీలు చేసే కరుడుగట్టిన దొంగల ముఠాను పట్టుకున్నామని చెప్పారు. ముఠా నాయకుడు భూక్యా నాయక్, అతని గ్యాంగ్ ను అరెస్టు చేశామని అన్నారు. వందల సంఖ్యలో దొంగతనాలకు ఈ ముఠా పాల్పడిందని, వీరిపై రెండు వందల కేసులు నమోదై ఉన్నట్టు తెలిపారు. ఈ ముఠాకు చెందిన ఇద్దరు సభ్యులు ఇప్పటికే విశాఖపట్టణం జైల్లో ఉన్నారని, ఇంజనీరింగ్ విద్యను అభ్యసించిన ఓ వ్యక్తి కూడా ఈ గ్యాంగ్ లో సభ్యుడిగా ఉన్నట్లు తెలిపారు.

More Telugu News