sobhan babu: శోభన్ బాబు గారిని గుర్తుపట్టలేకపోయినందుకు చాలా ఫీలయ్యాను: సీనియర్ హీరోయిన్ ప్రియా రామన్

  • శోభన్ బాబుగారితో 'దొరబాబు' చేశాను
  •  షూటింగుకి ఫ్లైట్ లో బయలుదేరాను
  •  ఆ ఫ్లైట్ లో శోభన్ బాబుగారు లేరనుకున్నాను

తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో సీనియర్ హీరోయిన్ ప్రియా రామన్ మాట్లాడుతూ, తనకి ఎదురైన ఒక ఆసక్తికరమైన అనుభవాన్ని గురించి ప్రస్తావించారు. "శోభన్ బాబుగారి సరసన కథానాయికగా నేను 'దొరబాబు' సినిమా చేశాను. ఈ సినిమా  ఫస్టు షెడ్యూల్ షూటింగును ఊటీలో ప్లాన్ చేశారు. దాంతో నేను చెన్నై నుంచి కోయంబత్తూరు ఫ్లైట్ కి బయలుదేరాను.

అదే విమానంలో శోభన్ బాబు గారు కూడా వస్తారని చెప్పారు. నేను ఆయన కోసం చూశాను .. ఎక్కడా కనిపించలేదు. ఆయన ఈ ఫ్లైట్ మిస్సయ్యారని అనుకున్నాను. బిజినెస్ క్లాస్ లో నేను వున్నాను .. ఒక పెద్ద మనిషి పేపర్ చదువుతూ కూర్చున్నారు. నేను ఆయన వైపు చూస్తే .. పలకరింపుగా నవ్వారు. నేను నవ్వకుండా ముఖం తిప్పేసుకున్నాను.

కోయంబత్తూరులో విమానం దిగాను .. రెండు కార్లు వచ్చాయి. శోభన్ బాబుగారు రాలేదు .. రెండు కార్లు ఎందుకు అని ప్రొడక్షన్ మేనేజర్ ని అడిగాను. 'శోభన్ బాబు గారు అదే విమానంలో వచ్చారు' అని ఆయన అన్నారు. అంతలో శోభన్ బాబుగారు అక్కడికి వచ్చారు .. బిజినెస్ క్లాస్ లో నేను చూసిన పెద్ద మనిషి ఆయనే. అయ్యో ఆయనను గుర్తుపట్టలేకపోయానే అని చాలా ఫీలైపోయాను. నేను తెరపై ఆయనని ఒక రొమాంటిక్ హీరోగా చూశాను .. ఆ ఇమేజ్ మనసులో ఉండటం వలన ఆయనని గుర్తుపట్టలేకపోయాను" అంటూ చెప్పుకొచ్చారు.   

More Telugu News