West Bengal: పశ్చిమ బెంగాల్ లో తుపాకీ ఎక్కుపెట్టి.. బీజేపీ నేత కుమార్తె కిడ్నాప్

  • ఐదు నెలల క్రితం టీఎంసీ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన నేత
  • 22 ఏళ్ల కుమార్తెను కిడ్నాప్ చేసిన దుండగులు
  • రాజకీయ కోణం ఉన్నట్టు ఆధారాలు లేవన్న ఎస్పీ

పశ్చిమబెంగాల్ లో బీజేపీ నేత కుమార్తెను కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపుతోంది. బీర్బమ్ జిల్లాలోని లబ్ పూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. బీజేపీ నేత సుప్రభాత్ బత్యాబ్యాల్ నివాసంలో అతని కుమార్తె (22)కు తుపాకీ గురిపెట్టి... కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ జరిగిన సమయంలో ఇంటి వద్ద ఆయన లేరు. ఐదు నెలల క్రితమే ఈయన మమతాబెనర్జీ పార్టీ టీఎంసీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. టీఎంసీలో చేరక ముందు ఆయన సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడిగా ఉన్నారు.

ఈ నేపథ్యంలో, సుప్రభాత్ సోదరుడు సుజిత్ మాట్లాడుతూ... ఐదుగురు దుండగులు ఇంట్లోకి ప్రవేశించారని... మమ్మల్నందరినీ తొలుత ఓ గదిలో ఉంచి బయట తాళం వేశారని చెప్పారు. ఆ తర్వాత తుపాకిని ఎక్కుపెట్టి ఇంటిబయట ఉంచిన కారు వద్దకు లాక్కెళ్లి, ఆమెను తీసుకెళ్లిపోయారని తెలిపారు.

ఈ ఘటనపై జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని చెప్పారు. దీని వెనుక రాజకీయ కోణం ఉన్నట్టు ఆధారాలు లభించలేదని అన్నారు.

More Telugu News