Andhra Pradesh: ఏపీలోనూ ప్రచారం చేస్తా: నందమూరి సుహాసిని

  • సంక్రాంతి వేడుకలకు తెనాలి వచ్చిన  సుహాసిని
  • సీఎం ఆదేశిస్తే ఏపీలో ప్రచారం
  • టీడీపీ విజయానికి సహకారం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశిస్తే ఏపీలోనూ ప్రచారం చేసేందుకు సిద్ధమని తెలంగాణ టీడీపీ నేత, దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని చెప్పారు. సంక్రాంతి వేడుకల కోసం గుంటూరు జిల్లా తెనాలి వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడారు. ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయానికి తమ కుటుంబం పూర్తిగా సహకరిస్తుందని అన్నారు.  

కాగా, ఇటీవల జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో టీడీపీ తరపున కూకట్‌పల్లి నుంచి బరిలోకి దిగిన సుహాసిని ఓటమి పాలయ్యారు.  ఎన్నికల్లో ఓడినా తాను కూకట్‌పల్లి ప్రజలకు అందుబాటులోనే ఉంటానని, సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. మరోవైపు, సుహాసిని టీఆర్ఎస్‌లో చేరబోతున్నారని, కేసీఆర్ చెబుతున్న ‘రిటర్న్ గిఫ్ట్’  అదేనన్న వార్తలు కూడా వినిపించాయి. తాజాగా, సుహాసిని మాట్లాడుతూ.. తమ కుటుంబం టీడీపీతోనే ఉంటుందని చెప్పడంతో ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టమైంది.

More Telugu News