akhilesh yadav: మేమిద్దరం కలిసే అవకాశాన్ని బీజేపీనే కల్పించింది: అఖిలేష్ యాదవ్

  • గత ఏడాది జరిగిన మూడు స్థానాల్లో బీజేపీ ఓడిపోయింది
  • వాటిలో యోగి ఆదిత్యనాథ్, ఆయన డిప్యూటీ స్థానాలు కూడా ఉన్నాయి
  • ఇదే ఊపును ఇకపై కూడా కొనసాగిస్తాం

సమాజ్ వాదీ పార్టీ, బీఎస్పీలు కలిసే అవకాశాన్ని బీజేపీనే కల్పించిందని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి, అఖిలేష్ లు లక్నోలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో రేపు మీడియా సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఒక రోజు ముందే పొత్తు వ్యవహారంపై అఖిలేష్ స్పందించారు.

తన భార్య డింపుల్ ప్రాతినిధ్యం వహిస్తున్న కన్నౌజ్ లో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గత ఏడాది జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ మూడు స్థానాల్లో ఓడిపోయిందని చెప్పారు. ఈ మూడింట్లో ముఖ్యమంత్రి యోగి, ఆయన డిప్యూటీ ప్రాతినిధ్యం వహించిన స్థానాలు (లోక్ సభ) కూడా ఉన్నాయని అన్నారు. ఈ ఊపును ఇలాగే ముందుకు తీసుకెళతామని చెప్పారు. ఇప్పటి వరకు ఎస్పీ, బీఎస్పీ కలిసే అవకాశం రాలేదని... ఆ అవకాశాన్ని బీజేపీనే కల్పించిందని చెప్పారు. బీజేపీ చేస్తున్న కుట్రల వల్ల ఇప్పటికే ఏపీలో టీడీపీ, అస్సాంలో అసోం గణపరిషత్ పార్టీ, బీహార్ లో రాష్ట్రీయ లోక్ సమతా పార్టీలు ఎన్డీయే నుంచి బయటకు వచ్చాయని తెలిపారు.

గత కొన్ని ఎన్నికల నుంచి వివిధ పార్టీలు ఒకటై పోటీచేయడం జరుగుతోందని అఖిలేష్ అన్నారు. బీజేపీ ఎంత మందితో ఎన్ని రకాల పొత్తులు పెట్టుకుందో ప్రజలు గుర్తించలేదని చెప్పారు. ప్రాంతీయ పార్టీలకు చెందిన పలువురు నేతలు అండగా ఉండటంతో... ఇప్పటికీ తామే బలమైన పార్టీ అని బీజేపీ భావిస్తోందని అన్నారు. అయితే, ఈ పార్టీలన్నీ ఇప్పుడిప్పుడే బీజేపీకి దూరమవుతున్నాయని చెప్పారు.

More Telugu News