cuddapah: ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఏపీ ప్రభుత్వం స్పందించలేదు!: 'కడప స్టీల్ ప్లాంట్' నిర్మాణంపై కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ప్రకటన

  • ఏపీ ప్రభుత్వం ఇప్పటికీ పూర్తి వివరాలు అందించలేదు
  • టాస్క్ ఫోర్స్ నుంచి విజ్ఞప్తి చేసినా స్పందించలేదు
  • ఏపీ ప్రజలకు మంచి చేయడం కోసమే చూస్తున్నాం

కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు సాధ్యపడదని సెయిల్ నివేదిక ఇచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఉక్కు కర్మాగారంపై పూర్తి వివరాలు అందించలేదని ప్రకటనలో పేర్కొన్నారు. ముడి ఇనుము లభ్యతపై రాష్ట్ర ప్రభుత్వం సర్వే ఆఫ్ ఇండియా నివేదికలు తీసుకుంటోందని తెలిపింది.

కడపలో స్టీల్ ప్లాంట్ పై ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని, దీని ద్వారా కర్మాగార సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని, ఈ నెల 17న టాస్క్ ఫోర్స్ సమావేశం జరిగిన విషయాన్ని ఆ ప్రకటనలో ప్రస్తావించింది. టాస్క్ ఫోర్స్ నుంచి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఏపీ ప్రభుత్వం స్పందించలేదని, తమ వద్ద ఉన్న నివేదికలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించలేదని విమర్శించింది. అటవీ, పర్యావరణ అనుమతుల నివేదికను ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఇవ్వలేదని, ఆ ప్రభుత్వం  సహకరించనందున మెకాస్ సంస్థ తుది నివేదిక ఇవ్వలేని పరిస్థితి నెలకొందని పేర్కొంది.

ముడి ఇనుము, లభ్యత, నాణ్యత, నిల్వల వివరాలను ఏపీ ప్రభుత్వం తమకు అందించలేదని, సంబంధిత సమాచారం ఇవ్వగానే మెకాస్ సంస్థ స్టీల్ ప్లాంట్ పై తుది నివేదిక ఇస్తుందని స్పష్టం చేసింది. పెట్టుబడులకు ఉన్న మార్గాలను కూడా మెకాన్ సంస్థే సూచిస్తుందని, సర్వే ఆఫ్ ఇండియా నివేదిక, స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను నిర్దేశిస్తుందని, ఏపీ ప్రజా ప్రతినిధులతో పాటు భాగస్వాములతో కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్ నిత్యం చర్చలు జరుపుతున్నారని తెలిపింది.

టాస్క్ ఫోర్స్ నివేదికలో పొందుపర్చే అంశాలపై బీరేంద్ర సింగ్ చర్చిస్తున్నారని, స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అంశం ఉన్నత స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయమని, రాష్ట్ర ప్రజలకు మంచి చేయడం కోసమే నివేదికను సిద్ధం చేస్తోందని కేంద్ర ప్రభుత్వం తన ప్రకటనలో స్పష్టం చేసింది. కాగా, కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఈరోజు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశంపై కేంద్రం ప్రభుత్వం ఈరోజు ప్రకటన విడుదల చేయడం గమనార్హం.

More Telugu News