Uttar Pradesh: 25 మంది తుపాకులతో వచ్చి బెదిరించి... 18 గేదెల దొంగతనం!

  • ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లాలో ఘటన
  • రూ. 20 లక్షల విలువైన గేదెల అపహరణ
  • ఆగ్రహంతో రాస్తారోకో చేసిన గ్రామస్తులు

దాదాపు 25 మంది తుపాకులు, మారణాయుధాలు తీసుకుని వచ్చారు. వారు దోపిడీ చేసి తీసుకెళ్లింది ఏంటో తెలుసా? 18 పాలిచ్చే గేదెలను. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లాలో జరిగింది. పోలీసులు వెల్లడించిన మరింత సమాచారం ప్రకారం, రత్నపురి గ్రామంలోని ఓ గేదెల యజమానిని బంధించి, తుపాకులు ఎక్కు పెట్టిన దుండగులు, 20 లక్షల రూపాయల విలువైన గేదెలను అపహరించుకుపోయారు.

నరేష్ కుమార్, ఆయన కుమారుడు మోహిత్ లు ఓ డెయిరీ ఫామ్ ను నిర్వహిస్తుండగా, దుండగులంతా, ఒక్కసారిగా లోపలికి ప్రవేశించి, వారిని బెదిరించారని, ఆపై తాము తెచ్చిన వాహనాల్లోకి గేదెలను ఎక్కించుకుని తీసుకెళ్లారని, వారి వద్ద ఉన్న బైకు, రెండు మొబైల్ ఫోన్లను తీసుకెళ్లారని పోలీసులు తెలిపారు. ఈ దోపిడీ తరువాత గ్రామస్తులు ఆగ్రహంతో, రహదారులను దిగ్బంధించి రాస్తారోకో చేశారని, పరిస్థితి అదుపు తప్పకుండా బందోబస్తును పెట్టామని తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దొంగలు ఎటు వెళ్లి ఉంటారన్న మార్గాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.

More Telugu News