Madhavi: ఇదీ నా బాధ... నా బిడ్డను మాత్రమే చంపాలనుకున్నా: పోలీసుల విచారణలో మనోహరాచారి

  • మాధవి రెండేళ్ల వయసులో హైదరాబాద్ కు వలస
  • కుమార్తెను అల్లారుముద్దుగా పెంచుకున్నా
  • మద్యం అలవాటు లేదు, ఐదు రోజులుగా తాగుతున్నా
  • ఆవేశంలోనే సందీప్ పై దాడి చేశానన్న మనోహరాచారి

చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమతో పెంచుకున్న కుమార్తె, తాను ఎంత నచ్చజెప్పినా వినకుండా వేరే కులం వ్యక్తిని వివాహం చేసుకోవడంతో, పట్టలేని ఆవేశంతో దాడి చేశానని, తన కుమార్తె మాధవిని మాత్రమే చంపాలని అనుకున్నానని, సందీప్ తన టార్గెట్ కానే కాదని, నడిరోడ్డుపై కొడవలితో దాడి చేసిన మనోహరాచారి పోలీసుల విచారణలో వెల్లడించినట్టు తెలిసింది. హత్యకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు సుదీర్ఘంగా విచారించగా, కుమార్తె ప్రేమ వివాహం తనకు ఏ మాత్రం ఇష్టం లేదని తేల్చి చెప్పాడు.

మాధవి రెండు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తాను పొట్టకూటికోసం హైదరాబాద్ కు వచ్చానని చెప్పాడు. అమీర్ పేటలోని గోవింద్ నగల షాపులో పనిచేస్తున్నానని వెల్లడించాడు. తాను సంపాదించిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుంటూ, బిడ్డను అల్లారు ముద్దుగా పెంచానని చెప్పాడు. తనకు మద్యం అలవాటు లేదని, కానీ, కూతురు వెళ్లిపోయిన తరువాత ఐదు రోజుల నుంచి తాగుతూనే ఉన్నానని అన్నాడు. తన మనసులోని కోపమంతా మాధవిపైనేనని అన్నాడు. ఆవేశంలో సందీప్ పై దాడి చేశానే తప్ప, చంపాలని అనుకోలేదన్నాడు. కాగా, మనోహరాచారి చేసిన దాడి హైదరాబాద్ లో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.

More Telugu News