Police: భార్యకు చికిత్స కోసం కన్నబిడ్డను అమ్మకానికి పెట్టిన తండ్రి.. ఆదుకున్న పోలీసులు!

  • ఉత్తరప్రదేశ్ లో కన్నౌజ్ లో ఘటన
  • రక్తస్రావంతో అసుపత్రిలో చేరిన భార్య
  • చికిత్స కోసం అమ్మకానికి కుమార్తె

గర్భవతైన భార్యకు చికిత్స అందించేందుకు డబ్బులు లేకపోవడంతో ఓ వ్యక్తి తన నాలుగేళ్ల కుమార్తెను అమ్మకానికి పెట్టాడు. దీంతో విషయం తెలుసుకున్న అధికారులు పాప అమ్మకాన్ని అడ్డుకున్నారు. ఈ హృదయ విదారక ఘటన ఉత్తరప్రదేశ్ లోని కన్నౌజ్ లో చోటుచేసుకుంది.

కన్నౌజ్ కు చెందిన అర్వింద్ బంజారా భార్య సుఖ్ దేవీకి ప్రస్తుతం ఏడో నెల. ఈ నేపథ్యంలో సుఖ్ దేవీకి రక్తస్రావం మొదలుకావడంతో బంజారా ఆమెను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ వైద్యులు బాధితురాలికి రక్తం ఎక్కించాలని చెప్పారు. లేదంటే ఆమె బతకడం కష్టమని స్పష్టం చేశారు. అయితే రక్తం కొనేందుకు కావాల్సిన డబ్బు తన దగ్గర లేకపోవడంతో అల్లారుముద్దుగా పెంచుకున్న నాలుగేళ్ల కుమార్తె రోషిణీని బంజారా రూ.25,000కు అమ్మకానికి పెట్టాడు.

ఈ విషయం తెలుసుకున్న తిర్వా స్టేషన్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని చిన్నారి అమ్మకాన్ని అడ్డుకున్నారు. చికిత్సకు అవసరమైన డబ్బును తాము అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయమై బంజారా దంపతులు మాట్లాడుతూ.. వేరే ప్రత్యామ్నాయం లేకపోవడంతోనే తాము బిడ్డను అమ్మకానికి పెట్టామని వాపోయారు.

More Telugu News