vidisa: భార్య ముక్కు, నోట్లో జిగురు పోసి హత్య చేసిన భర్త.. మధ్యప్రదేశ్ లో దారుణం!

  • భార్య వాగ్వాదంతో రెచ్చిపోయిన భర్త
  • జిగురు పోసి కిరాతకంగా హత్య
  • నిందితుడి కోసం పోలీసుల గాలింపు

భార్యతో గొడవ పడ్డ ఓ భర్త విచక్షణను కోల్పోయాడు. ఆమె నోరు, ముక్కు, కళ్లల్లో గట్టి జిగురు(గ్లూ) లాంటి పదార్థాన్ని పోశాడు. దీంతో ఊపిరాడక బాధితురాలు చనిపోయింది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ లోని విదిశాలో చోటుచేసుకుంది.

విదిశాలోని రాజ్ పుత్ కాలనీలో హల్కేరామ్ కుష్వాహా, దుర్గా బాయి దంపతులు ఉంటున్నారు. అయితే వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో శుక్రవారం మరోసారి వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో బయటకు వెళ్లాలని ఇద్దరు పిల్లల్ని హల్కేరామ్ సూచించాడు.

అనంతరం విరిగిపోయిన వస్తువులను అతికించేందుకు వాడే జిగురు లాంటి పదార్థాన్ని దుర్గా బాయి నోరు, ముక్కు, కళ్లలోకి బలవంతంగా పోశాడు. దీంతో ఊపిరాడక ఆమె ప్రాణాలు విడిచింది. అనంతరం భర్త అక్కడి నుంచి పరారయ్యాడు. బయటకెళ్లిన 15 ఏళ్ల కుమారుడు తిరిగి ఇంటికిరాగా, తల్లి చలనం లేకుండా నేలపై పడి ఉంది. దీంతో ఆ బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న హల్కేరామ్ కోసం గాలింపు చేపట్టారు.

More Telugu News