Telugudesam: టీడీపీ అధినేత గేమ్ ప్లాన్ పకడ్బందీగా చేశారు: సబ్బం హరి

  • ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే టీడీపీ గెలుస్తుంది
  • మరో ఆరు నెలలు గడిస్తే ఎవరు గెలుస్తారో చెప్పలేం
  • 2019 ఎన్నికల్లో నేను కచ్చితంగా పోటీ చేస్తా

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాజకీయంగా గేమ్ ప్లాన్ పకడ్బందీగా చేశారని మాజీ ఎంపీ సబ్బం హరి అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ నాడు ఎన్డీఏతో కలిసి ఉండటం, ఆ తర్వాత బయటకొచ్చేయడం కరెక్టేనని అన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఏపీలోని పార్టీలు స్వతంత్రంగా పోటీ చేస్తే టీడీపీ గెలుస్తుందని, మరో ఆరు నెలలు గడిస్తే ఎవరు గెలుస్తారో చెప్పలేమని అభిప్రాయపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా వద్దని, ప్యాకేజ్ కావాలని చంద్రబాబు అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారని, అసలు ఆయన అన్నారా? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇవ్వలేం ప్యాకేజ్ తీసుకోవాలని నాడు బీజేపీ చెప్పింది కనుకే చంద్రబాబు ఒప్పుకున్నారని అన్నారు.

ఈ సందర్భంగా తాను ఏ రాజకీయ పార్టీలో చేరే విషయమై ఆయన మాట్లాడుతూ, 2019 ఎన్నికల్లో తాను కచ్చితంగా పోటీ చేస్తానని చెప్పారు. అయితే, ఎంపీగానా లేక ఎమ్మెల్యేగానా? అనే విషయం ఇంకా తేల్చుకోలేదని చెప్పిన ఆయన, అసెంబ్లీకి పోటీ చేయాలని అనుకుంటున్నట్టు చెప్పారు. ఒకవేళ టీడీపీ-బీజేపీ కలిసి ఉన్నట్టయితే ఎంపీగా పోటీ చేసేవాడినేమోనని వ్యాఖ్యానించారు. తాను రాజకీయ అవకాశవాదిని కాదని, అలా అయితే, టీడీపీలో చేరమని చంద్రబాబు పిలిచినప్పుడే వెళ్లేవాడినని అన్నారు.

More Telugu News