Chandrababu: ఏపీలో అన్ని ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి: సీఎం చంద్రబాబు

  • బీజేపీకి ఇబ్బంది ఉందనే జమిలి ఎన్నికలు అంటోంది
  • రెండు, మూడు రాష్ట్రాల్లో ఓడిపోతామని బీజేపీకి భయం
  • సరైన ప్రణాళికతో వెళుతూ దక్షిణాది రాష్ట్రాలతో పోటీపడుతున్నాం

మన రాష్ట్రంలో అన్ని ఎన్నికలు ఒకేసారి జరుగుతాయని, స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి కోర్టు ఏదైతే చెప్పిందో అదే మనకూ వర్తిస్తుందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన టీడీపీ నేతల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీజేపీకి ఇబ్బంది ఉందనే జమిలి ఎన్నికలు అంటోందని, వచ్చే ఎన్నికల్లో రెండు, మూడు రాష్ట్రాల్లో ఓడిపోతామన్న భయంతో ఈ ఎన్నికలను బీజేపీ తెరపైకి తెచ్చిందని విమర్శించారు.

సరైన ప్రణాళికతో వెళుతూ దక్షిణాది రాష్ట్రాలతో పోటీపడుతున్నామని, లేకపోతే, ఏపీ మరో బీహార్ లా తయారయ్యేదని అన్నారు. ఏపీలో వ్యవసాయరంగానికి సంబంధించి ఎన్నో ఇబ్బందులను అధిగమించామని, రుణమాఫీతో రైతుల్లో ఒక నమ్మకం ఏర్పడిందని అన్నారు. గత ప్రభుత్వంలో ఎన్నో కుంభకోణాలు చూశామని, వాన్ పిక్, లేపాక్షి, బాక్సైట్ కుంభకోణాలు కొన్ని మాత్రమేనని, కాంగ్రెస్ పాలనలో పారిశ్రామికవేత్తలు, అధికారులు జైలుకెళ్లారని, ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీశారని విమర్శించారు. 

More Telugu News